Translate

Monday, November 29, 2021

[Rare] Maha Kalbhairav - Yam Yam Yam Yaksha Roopam (lyrics)

ఓంకారం సకలకళా శ్రీకారం- Omkaaram Sakala saakram telugu song lyrics(Sankaracharya, Telugu )

 





ఓంకారం సకలకళా శ్రీకారం

చతుర్వేద సాకారం

చైతన్య సుధాపూరం

జ్ఞాన కమల కాసారం

 

ధ్యాన పరిమళాసారం

మధుర భక్తి సింధూరం

మహా భక్త మందారం

భవ భేరీ భాండారం

 

హృదయ శంఖ హుంకారం

ధర్మ ధనుష్టంకారం

జగత్ విజయ ఝంకారం

అద్వైత ప్రాకారం భజేహం

 

అండాకారాండ పిండ భాస్వత్

బ్రహ్మాండ భాండ నాదలయత్

బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాధారం

వర్ణ రహిత వర్గమధిత

 

లలిత లలిత భావ లులిత భాగ్య

రజిత భోగ్య మహిత వసుధైక కుటిరం

కామితార్ధ బందురం

కళ్యాణ కందరం

సద్గుణైక మందిరం

సకలలోక సుందరం

పుణ్య వర్ణ పుష్కరం

దురిత కర్మ దుష్కరం


శుభకరం సుధాకరం

సురుచిరం సుదీపరం

భవకరం భవాకరం

త్రిఅక్షరం అక్షరం భజేహం

 

మాధవ మాయా మయ బహు

కఠిన వికట కంటక పద సంసార

కానన సుఖ యాన శకట విహారం

 

అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట

మహా మంత్ర యంత్ర తంత్ర

మహిమాలయ గోపురం

ఘనగంభీరాంబరం

జంబూ భూభంబరం

నిర్మల యుగ నిర్గరం

నిరుపమాన నిర్జరం

మధుర భోగి కుంజరం

పరమ యోగి భంజరం

ఉత్తరం నిరుత్తరం మనుత్తరం

మహత్తరం మహాకరం మహాంకురం

తత్త్వమసీ తత్పరం

తధితరాత్త మోహరం

మృత్యోర్మమృతత్వకరం

అజరం అమరం

 

'' కారం '' కారం '' కారం

ఓం కారం అద్వైత ప్రాకారం

Tuesday, November 23, 2021

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....- Naa gurudu nannika - Telugu Lyrics

 యోగి తత్వం



నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక త్యాగి గమ్మనెనే....త్యాగి గమ్మనెనే.... జ్ఞాని గమ్మనెనే..

మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...
మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...పుట్టుగిట్టులులేని బట్టాబయలయెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మూలామించుక లేని కీలెరుగు మనెనే...
మూలామించుక లేని కీలెరుగు మనెనే...కాలకాలములెల్ల కల్లా జగమనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....త్యాగి గమ్మనెనే...

మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....
మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....మరుగునెరుగితే నీవు తిరిగిరావనెనే..
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..
ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..సున్నా జేసియు దాని యెన్నాగవలెననే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట మహదేవుపేట మలికిదాసనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.... త్యాగి గమ్మనె.... జ్ఞాని గమ్మనెనే...

Satkarmabhisha Song - సత్కర్మభీశ్చ సత్ఫలితం


సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి
కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఏ కన్నూ చూడదనా
నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా
తప్పటడుగే నీ అలవాటు
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి
ఎంత బతుకు నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా
ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

Sunday, November 7, 2021

మంత్రం అంటే ఏమిటి? What is Mantra ? Telugu

మంత్రం అంటే ఏమిటి?




మంత్రానికి ఉన్న అర్థమేమిటి?

మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.
ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలా? ఈ బీజాక్షరాలను ఎలా పలకాలి? బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.
అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.
అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?.. భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.
అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.
ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.
అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!
మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా?..మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?
ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.
దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.
జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే

జ్ఞానం అంటే ఏమిటి?What is Knowledge? Telugu

 

జ్ఞానం అంటే ఏమిటి?



జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం?
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు, బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన B.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.

జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం. దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.

1. ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
2. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.
3. అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.
4. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
5. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.
6. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.
7. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
Source : వేద శాస్త్రం

Sunday, September 26, 2021

Sankaraacharya -శంకరాచార్యులు:శంకరం - లోక శంకరం :వాస్తవిక

శంకరం - లోక శంకరం :వాస్తవిక 


.....ఈ‌ వ్యావహారిక‌‌ శకానికి పూర్వం (Before Common Era) 509లో శంకరులు పుట్టారని, 
అని ప్రధానమైన శంకరమఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ తెలియవస్తోంది.  వారి కాలంలో  సనాతన ధర్మానికీ, భారతప్రదేశానికీ హిందూ పదం ఆపాదించబడలేదు. 
అందుకే వారి రచనలలో ఎక్కడా 
హిందూ అన్న పదం మనకు కనిపించదు.‌ 
మనం చదివినట్లుగా వారి జననం వ్యావహారిక(Common Era ) శకం 788 అయి ఉంటే అప్పటికి హిందూ పదం చలామణిలోకి వచ్చింది, కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందూ పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ‌ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకార శంకరులు ఈయన ప్రసక్తి  చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన  ప్రముఖ బౌద్ధ‌ పండితుడు దిజ్ఞాగుడు.  దిజ్ఞాగుని ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది. వ్యావహారిక శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటకకర్త భవభూతి శంకరుల  వివర్త వాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పటికి శంకరులు చాలా పూర్వం వారని తెలుస్తోంది. వ్యావహరిక శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ‌బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు‌ చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ‌ స్వదేశీ‌ మతాల్లో బౌద్ధమతం‌ లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది.

 ఆది శంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి‌ (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివగురువు,‌ ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీ శక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16 ఏళ్లకే తమ ఇతర‌ రచనలతో పాటు ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులూ, బ్రహ్మసూత్రాలూ, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత వ్యాప్తికి వచ్చింది. ప్రస్థాన త్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి‌‌ తీసుకువచ్చారు. ఆది శంకారాచార్య వేఱు, వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ వ్రాసి మనకందించారు. 

...వక్రపు వ్యాఖ్యానాలతోనూ, వక్రపు ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం‌‌ అస్తవ్యస్తమైన కాలంలో ఆది శంకరాచార్యులు  వేద ప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు.  కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో  విశేషంగా కృషిచేశారు వారు.  ఆది శంకరాచార్యులు తమ అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న  సామాజిక,‌ సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం‌ సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు,‌ ప్రవహింపజేశారు. 

ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు,‌ ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త‍‍, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు‍, ఒక‌ మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు,‌ ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక‌ అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమ కారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మనిర్మాత ఆది శంకరాచార్య. 

ఆది శంకరుల నుడి‌ తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి. శంకరత్వాన్ని సరిగ్గా‌‌ స్మరించుకుందాం‌‌ ఇదిగో ఇలా ...

"ఏవమాత్మా రణౌ ధ్యానమథనే సతతం‌‌ కృతే / ఉదితాన గతి ర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్" (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు‌ కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం.‌ ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు!

 "సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్ / సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః" (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా,  నేను నీవాణ్ణి. కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది‌ నిజం‌. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు‌. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు. "స్వప్నో జాగరణేఽలీకః స్వప్నేఽపి నహి జాగరః / ద్వయమేవ లయే నాస్తి లయోఽపి హ్యు భయోర్న చ"(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే మెలకువలో కల లేదు. కలలో  మెలకువ లేదు. ఈ‌‌ రెండూ మరణం‌(లయ)లో‌ లేవు. ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం.‌  అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!

"జ్ఞానం‌ లేకపోతే స్వేచ్ఛ లేదు. అగ్ని లేకపోతే వంట లేనట్లుగా" (ఆత్మబోధ‌- శ్లోకం 2). "విద్య అవిద్యను పోగొడుతుంది‌‌. తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్లు". (ఆత్మబోధ- శ్లోకం 3) "నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై  ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి". (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనలు మనకు కవులు రూమీలోనూ, ఖలీల్ జిబ్రాన్ లోనూ కనిపిస్తుంది. "పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది". (ఆత్మబోధ - శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో? ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ?
"దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు  తనే ప్రకాశిస్తుంది కాబట్టి".(ఆత్మ‌బోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది‌. "రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా". (ఆత్మబోధ- శ్లోకం 37)  సహజమైన ఉపమ‌‌ ఇది!  ఇలాంటివి కవి లావ్ ట్సూ లోనూ  కనిపిస్తాయి. "నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో‌ ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా" (ఆత్మబోధ- శ్లోకం 53)
ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా?‌ రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావ్ ట్సూ వంటి కవుల్లో ఈ ధోరణి ఉన్నది. "పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది" (ఆత్మబోధ- శ్లోకం 59) ఇక్కడ
"పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు" అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే..
"అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు" (ఆత్మబోధ-‌శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి‌‌ మాటలు‌ శంకరులు ఎన్నో అన్నారు.

"ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి‌ ఇప్పుడు ఆలోచించు. ( 8 వ శ్లోకం మోహముద్గర లేదా  భజగోవిందం‌ శ్లోకాలు) కవి‌ ఖలీల్ జిబ్రాన్  "your children are not your chidren" అని అనడానికి వందల ఏళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు.
"నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ‌ పథంలోకి ప్రవేశించు.‌ (11వ శ్లోకం భజగోవింద‌ం‌ శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.

"ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం
విణ్మూత్ర మేధ్య మధ్యేక్కథ యతి‌ నితరాం జాఠరో జాతవేదాః
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం".(శివాపరాథ క్షమాపణ స్తోత్రం.‌‌ శ్లోకం 1)  అంటే మొదట్లో కర్మ అవసరం వల్ల (లేదా కర్మ విస్తరణ వల్ల) కలుషితమై‌న తల్లి కడుపులో ఉండేవాణ్ని నేను. మలమూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నాయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. "గర్భంలోని శిశువు దుఃఖాన్ని , వ్యథను ఎవరు‌ చెప్పగలరు?"‌ ఈ భావన చేసిన‌‌ తొలి కవి, తాత్త్వికులు ఆది‌శంకరాచార్యులే. లావ్ ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్ , షేక్స్పియర్ వంటి కవులెవ్వరూ ఇలాంటి‌ లేదా ఈ‌ స్థాయి చింతన,‌ భావన చెయ్యలేదు. ఇలాంటి రచన, చింతన ఇది ఒక్కటే!

"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరల తరంగే" (గంగా స్తోత్రం - శ్లోకం 1) ఆది‌శంకరులు తమ‌ గంగా స్తోత్రంలో గంగా‌‌ నదిని "తరల‌ తరంగే‌" ‌అన్నారు. "తరలం" అంటే కదిలేది, ప్రకాశించేది,‌ అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా‌ నదిని (వసుధాహారం) "భూమికి‌ హారం" అన్నారు. ఇది శంకరుల భవ్య‌మైన భావుకత.

ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి.‌ ఆలకించండి ... 

ఏది అన్నిటికన్నా  ప్రయోజనకరమైనది?

జవాబు: ధర్మం 

ఏది వాంఛింపదగినది?

జవాబు: స్వ, పర హితం.
 
శత్రువు ఎవరు?

జవాబు: సోమరితనం.

ఏది దుఃఖం?

జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.

ఏది‌ జాడ్యం?
జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.

ఏది వెలలేనిది?
జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది.

ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?
జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.

 ఏది దానం?
జవాబు: ఆకాంక్ష లేనిది.

ఎవరు స్నేహితులు?
జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.

ఏది పాతకం?
జవాబు:‌ హింస.

ఎవరు ఎదుగుతారు?
జవాబు: వినయం ఉన్నవాళ్లు. 

ఎవరు ప్రత్యక్ష దేవత?
జవాబు: అమ్మ.

వేటిని మనుషులు సంపాదించాలి?
జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.

వేటిని కాపాడుకోవాలి?
జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి
 
ఎవరు శూరులు?
జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.

ఆది శంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తమను తాము "ద్రావిడ శిశు" అని‌ ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం: "తవ స్తన్యం మన్యే తుహినగిరి కన్యే హృదయతః/పయఃపారావారః పరివహతి సారస్వత మివ / దయావత్యా దత్తం ద్రవిడశిశు‌రాస్వాద్య తవ యత్ / కవీనాం ప్రౌఢానా నుజని‌ కమనీయః కవయితా".  శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో వ్రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం‌‌ చదువుకున్నది?. ఇక్కడ ఆర్యులైన శంకరులు  సంస్కృతంలో తమను తాము‌ ద్రావిడ శిశు‌‌ అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి?‌  నిజమేమిటంటే,  "శంకరుల కాలానికి మన దేశంలో ఆర్య‌ ద్రావిడులు అన్నది లేదు". నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణ భూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అనే పదం భాషల విభజనకు చెందిన పదం కావచ్చు. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ద్రావిడ అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది శ్రేష్ఠులను సంబోధించే పదం.  అయ్యా , మహాశయా అన్నట్లుగా.... శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని‌ తెలియవస్తున్నది.‌ ("Aryan invasion is an abandoned theory"  అని Oxford Reference Dictionary కొన్నేళ్ల క్రితం తేల్చి చెప్పింది) ఈ శ్లోకానికి‌ అర్థం : హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి.   సారస్వతం (సరస్వతికి‌ సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).‌ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా‌ సంవిధానాన్నీ‌ చూపారు ఇక్కడ శంకరులు‌. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావ్‌ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్పియర్‌ల రచనా సంవిధానం పుష్కలంగా శంకరులలో తొణికిసలాడుతూంటుంది. నిజానికి‌ వీళ్లే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీశ్రీ , వంటి కవులు కూడా శంకరుల కవితా రచనా‌‌ పరిధిలోని వాళ్లే!

వివేక చూడామణి....ఆది‌ శంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయకంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ‌‌ వివేక చూడామణి (శ్లోకం‌ 63)లో ‌"అజ్ఞాన సర్ప‌దష్టుడైన (శ్రీశ్రీ‌ బాధాసర్ప దష్టులారా,‌ అనడానికి శంకరుల‌‌ ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం?‌‌ అనీ, (శ్లోకం‌ 64లో)
"మందుల పేర్లవల్ల కాదు వాటిని‌ సేవిస్తే తప్ప వ్యాధి పోదు‌‌. స్వానుభవం‌ (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు" అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ,‌ ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది.

ఆది శంకరాచార్య ఒక సర్వజ్ఞ. "మీకు చెప్పులు కుట్టడం వచ్చా"  అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండుపాదాల మధ్యలో పెట్టకుని సూదిని‌ ముక్కు‌ పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట‌. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం‌ వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి‌ వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా‌ భయపడకుండా సత్యం కోసం‌ పయనించారు, పని చేశారు. 

"ఆది శంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తిమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు"

అటువంటి ఆ మహాశక్తికి,‌ ఆ సనాతన అభివ్యక్తికి; ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్త్విక కాంతికి; ఆ‌ విశ్వ మహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి; ఆ విశేష నైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి; ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు;  ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ప్రణామం చేద్దాం. 

"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం.
సదా అనుగమించాల్సిన తత్త్వం"🙏🙏🙏