Translate

Sunday, January 26, 2025

యోగచూడామణి ఉపనిషత్ v01 ( Yoga Chudamani Upanishad in telugu)

 యోగచూడామణి ఉపనిషత్



( ఇందులోని విశేష యోగాభ్యాస విశేషములు గురుముఖతః నేర్చుకొనబడును గాక । )


మూలాధారము’ మొదలైన షట్ చక్రములలోను, కపాలమునకు ఊర్ధ్వముగా గల బ్రహ్మ రంధ్రమును దాటి, ఉపరిగా సహస్రారము వరకు కూడా ఆక్రమించి ఉన్నట్టిది, యోగ-జ్ఞానముల అంతిమసారము అయినట్టి - ఆత్మారాముని ధ్యానము చేయుచున్నాము.


తత్త్వజ్ఞాన సంపన్నులగు గురువర్యులవారి ప్రవచనము

కేవలాత్మానంద - సహజానంద- బ్రహ్మానంద స్వరూపులు, ‘‘బ్రహ్మతత్త్వ’’ అధ్యయనులు అగు ప్రియశిష్యులారా! శ్రోతలారా!

ఈరోజు మనము యోగులకు హితకామ్యము అగు ‘‘యోగచూడామణి’’ అనే పాఠ్యాంశమును చెప్పుకొంటున్నాము. ఇది యోగవేత్తలచే రహస్యముగా సేవించబడుచూ ‘‘కైవల్యసిద్ధి’’ ప్రసాదించునదిగా యోగ-తత్త్వ శాస్త్రవాఙ్మయములో సుప్రసిద్ధము.

షట్ యోగాంగములు

(1) ఆసనము (2) ప్రాణసంరోధము (ప్రాణాయామము) (3) ప్రత్యాహారము (4) ధారణ (5) ధ్యానము (6) సమాధి - ఇవి యోగాభ్యాసమునకై ఆరు అంగములు అయి ఉన్నాయి.
యోగాభ్యాసమునకు సంసిద్ధుడు అగుచున్నవాడు ముందుగా కొన్ని అతిముఖ్యమైన ఈఈ విశేషాలను సశాస్త్రీయంగాను, గురుముఖతఃగా సుస్పష్టంగా ఎరిగినవాడై ఉండాలి.

మహదాశయము

సిద్ధాసనము - అంతరార్థము : ‘‘యోగాభ్యాసముచే నేను సిద్ధించుకోవలసినదిగా ఏదై ఉన్నది?’’.. అనునది సుస్పష్టపరచుకోవాలి. ‘‘ఈ దృశ్యము, జాగ్రత్ స్వప్న సుషుప్తులు, దేహముల రాకపోకలు, లోకవ్యవహారములు - ఇవన్నీ క్రీడగా, లీలగా సిద్ధింపజేసుకొనుచున్న ఆత్మయే నాయొక్క సహజ స్వరూపము, స్వభావము కదా!’’ - అనునది అనునిత్యంగా స్వాభావికం కావటమే సిద్ధాసన తత్త్వార్థము. ఇట్టి మహదాశయమును జ్ఞాపకముగా పదిలపరచుకోవాలి. ‘‘భూతకాశ-చిత్తాకాశములకులకు ఆవల చిదాకాశ స్వరూపుడను కదా!’’ - అను స్వాభావికానుభవమే నాయొక్క ముఖ్యాశయము’’.. అను అవగాహనను సుస్పష్టీకరించుకొని ఉండటమే సిద్ధాసనము యొక్క పరమార్థముగా ఆధ్యాత్మిక నిర్వచనము.

జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఆత్మస్వరూపుడుగా నేనే సిద్ధించుకొనుచున్నాను’’ అను ఆసీన స్థితియే సిద్ధాసనము.

కమలాసనము : బుద్ధియొక్క మహత్తర అవగాహన కొరకు, మనస్సు యొక్క నిశ్చలత కొరకు - ‘‘పద్మాసనము’’ ధారణ చేయుటము - శుభప్రదమగు అభ్యాసము. యోగాభ్యాసమునకై ఇష్టమైన ఆసనము ఆశ్రయించబడు గాక।

షట్ చక్రములు : ఈ భౌతిక మానవ దేహముతో ఆరు(6) ప్రదేశములు. ‘‘శక్తి కేంద్రీకృత - శక్తి ప్రసరణ’’ స్థానములు. అవి వెన్నెముక యందు/ వెన్నెముకను ఆశ్రయించి ఉన్నాయి. ఇవన్నీ యోగవిద్యాప్రావీణ్యులచే శాస్త్రీకరించబడి చెప్పబడుచున్నాయి.

షట్‌చక్రములు

యోగదండము

(1) మూలాధార చక్రము : గుదస్థానము : పృథివి. 4 దళములు.
(2)
 స్వాధిష్ఠానచక్రము : పొత్తికడుపు - జలము. మేఢ్రము. 6 దళములు.
(3)
 మణిపూరక చక్రము : బొడ్డు ప్రదేశము. అగ్ని.10 దళములు.
(4)
 అనాహత చక్రము : హృదయ ప్రదేశము. వాయువు. 12 దళములు.
(5)
 విశుద్ధచక్రము : కంఠ ప్రదేశము. ఆకాశము. 16 దళములు.
(6)
 ఆజ్ఞాచక్రము : భృకుటి ప్రదేశము. మహాప్రకృతి. 2 దళములు.

(తదితర ఉపనిషత్తుల నుండి ఇక్కడ సూచనగా కొంచెముగా చెప్పుకోబడుచున్నది)

ఈ షట్‌చక్రముల గురించి యోగాభ్యాసి శ్రద్ధగా శ్రవణము, అధ్యయనము చేయటము ఆవస్యకము. వాటి వాటియందు బుద్ధిని, ధ్యాసను నిలిపి ఉంచటము ‘‘షట్‌చక్రోపాసన’’.

షోడశాధారము : పంచప్రాణములకు, పంచ జ్ఞానేంద్రియములకు, పంచ కర్మేంద్రియములకు అనుభవి అగు జీవాత్మకు - కారణమగుచున్నట్టిది. (ఇంకా కూడా) - జీవునికి ఆధారమైయున్నట్టిది. ప్రేరణ రూపమైయున్నట్టిది. అటువంటి కారణకారణమైయున్నట్టిదగు ‘‘ఆత్మ’’ యొక్క ఉనికిని గమనించటము.

త్రిలక్ష్యము : జాగ్రత్-స్వప్న-సుషుప్తులను లక్షణముగా యుండి, (లక్ష్యరూపమై) సంచార ప్రదర్శనముగా కలిగియున్న ‘‘ఆత్మ’’ యొక్క గమనిక.

వ్యోమ పంచకము : ప్రాణ అపాన సమాన ఉదాన అపాన వాయు ప్రవర్తనముల (కదలికల)కు ఆవలగల ‘‘కదలించుతత్త్వము’’ - యొక్క గమనిక.

ఇవన్నీ కూడా స్వదేహములోని ఆయా ఆయా పరిశీలనార్హమైన విశేషములు.

స్వదేహే యో న జానాతి, తస్య సిద్ధిః కథమ్ భవేత్? ఇవన్నీ ఎవ్వడు స్వదేహమునందే గమనించడో అట్టివానికి సిద్ధి ఎట్లా కలుగుతుంది?

- - -

ఇంకా షట్ చక్రముల గురించిన ఎరుగవలసిన విశేషములు -

(1) మొదటిది - ఆధార చక్రము, ‘4’ దళములు (2) రెండవది - స్వాధిష్ఠాన చక్రము, ‘6’ దళములు

ఆ రెండింటి మధ్యగా : యోని స్థానము. కామరూపము. కామాఖ్యము. గుదస్థానము (పురీష విసర్జన స్థానములో 4 దళములు గల పద్మము, తన్మధ్యే ప్రోచ్యతే యోనిః। దాని మధ్యగా కామాఖ్యమైనట్టి యోని ఉన్నది.

అట్టి యోని మధ్యగా పశ్చిమంగా (Towards West) ఎడమవైపుగా అభిముఖమై ‘మహాలింగము’. అద్దాని నాభియందు మణివంటి బింబము. అట్టి మణిబింబమును ఎరిగినవాడు యోగవేత్త. నాభే తు మణివత్ బింబమ్ యో జానాతి, స యోగవిత్।

స్వాధిష్ఠానము

మేఢ్రమునకు (పురుష లింగమునకు) దిగువగా త్రి-కోణంగా మేలిమి బంగారపు - మెరుపు తీగవలె ప్రకాశించునట్టి తేజస్సు. ఆ తేజస్సు విశ్వతోముఖమైయున్నది. అది విశ్వమంతా నిండి అనంతమైయున్నది. అది సమాధియొక్క సహజ తేజోరూపము.

అద్దాని దర్శనము సమాధియందు సుసాధ్యము. అట్టి దర్శనము మహాయోగము. అద్దానికి ‘రావటము, పోవటము’ - అనునదేదీ లేదు. సమస్తమునకు తానే అయి ఉన్న అద్దానికి రాకపోకలు ఎట్లా ఆపాదించగలం? అట్టి స్వాధిష్ఠాన చక్రమును ఉపాసనచే స్వానుభవముగా చేసుకొని అధిష్ఠించువాడు దేహముచే పుట్టడు-చావడు. ఇది మూలాధారమునకు, మేఢ్రము (మాంసపుముద్ద విభాగము)నకు ఉపరిగా స్థానము కలిగియున్నది.

    స్వ = స్వశక్తిరూపమగు ప్రాణము.   అధిష్ఠానము = ఆక్రమించినదై ఉన్నట్టిది.

ప్రాణమునకు ఆశ్రయము కాబట్టి - స్వాధిష్ఠానము. ఇదియే ‘మేఢ్రము’ అని మేఢ్రాంతర్గత తేజస్సు అని కూడా పిలువబడుచున్నది.

మణిపూరకము

తంతునా మణివత్ ప్రోతో యో అత్ర కందః సుషుమ్నయా, తత్ నాభిమండలే చక్రం ప్రోచ్యతే మణిపూరకమ్।।

నాభిమండలము (బొడ్డు ప్రదేశం)లో - దారముచే ‘మణి’ వలె-గ్రుచ్చబడి ఉండటం చేత ఇది ‘మణిపూరకచక్రము’ - అని పిలువబడుచున్నది. ఈ మణిపూరక చక్రము - ఎక్కడైతే కందము (మాంసపు చతురస్రము), సుషుమ్నా నాడి ఏర్పడి ఉన్నాయో - అట్టి నాభి (బొడ్డు) మండలములో మణివలె ఏర్పడి ఉన్నది. యోగులు ఇది గమనించుచూ అభివర్ణిస్తున్నారు.

ద్వాదశార మహాచక్ర- అంతరమున భ్రమణము

(స్వతఃగా పుణ్య-పాప ద్వంద్వాతీతుడగు) ఈ జీవుడు ‘తత్త్వము’ (త్వమ్‌గా కనబడుచున్నది తత్ రూప పరమాత్మయే) అని ఎరుగనంతకాలము ఇక్కడి ‘‘ద్వాదశార మహాచక్రము’’లో పుణ్యపాపములతో (ద్వంద్వములతో) సంబంధము కలిగియుండి - తిరుగాడుతూనే ఉంటాడు.

నాడులు - నాడీ మహాచక్రము

ఊర్ధ్వం మేఢ్రాత్, అధో నాభేః కందే యోనిః ఖగాండవత్ - మేఢ్రమునకు ↑ ఊర్ధ్వంగా.. బొడ్డుకు ↓ క్రిందగా గల ‘కందము’ నందు పక్షిగ్రుడ్డు ఆకారము వంటి ‘యోని’ ఉన్నది. అట్టి ఆ యోని నుండి 72000 నాడులు బయల్వెడలుచూ, దేహమంతా విస్తరించి ఉంటున్నాయి.

అందులో 72 నాడులు ప్రధాన నాడులు. (తదితరమైనవి ఉపనాడులు). ఆ 72 నాడులలో- ప్రాణవాహిన్యో భూయః తాసు దశస్మృతాః। వాటిలో ప్రాణశక్తి వాహకములుగా 10 ముఖ్యమైన నాడుల గురించి యోగశాస్త్రము విశదీకరించటం జరుగుతోంది.

(మేఢ్రము = మేహనము - మగగురి, మూత్రవిసర్జనము, పురుషలింగము)

(1) ఇడ (2) పింగళ (3) సుషుమ్న (4) గాంధారి (5) హస్తి జిహ్వ (6) పూష (7) యశస్విని (8) అలంబుస (9) కుహు (10) శంఖినీ -

10 నాడులతో కూడిన చక్రమును నాడీమహాచక్రము’ అంటారు. అట్టి నాడీ మహాచక్రమును యోగి ఎరుగుచున్నాడు. వాటి స్థితి, కార్యనిర్వహణల గురించి సంక్షిప్తంగా వివరించుకుంటున్నాము.

నాడీ సంస్థితము / నాడీ ద్వారములు

ఇడ = శరీర మధ్య భాగపు ఎడమ వైపుగాను, పింగళ = కుడివైపుగాను, సుషుమ్న = మధ్య ప్రదేశముగాను సంస్థితమై ఉన్నాయి.
గాంధారి = ఎడమ కంటిలోను, హస్తిజిహ్వ = కుడికంటిలోను, యశశ్విని = ఎడమ చెవిలోను, పూష = కుడిచెవిలోను, అలంబుస = ముఖమునందు, కుహు=లింగప్రదేశములోను, శంఖిని = మూలస్థానమునందు - చిట్ట చివ్వరి ద్వారములుగా కలిగియున్నాయి.

ఇడ పింగళ సుషుమ్న నాడులు : పైన చెప్పుకున్న 10 నాడులలో, - ఇడ, పింగళ, సుషుమ్ననాడులు అతి ముఖ్యమైనవి. ఈ మూడు ప్రాణమార్గమున సంస్థితమై ఎల్లప్పుడు ప్రాణవాహిన్యములై (ప్రాణవాహకములుగా) ఉన్నాయి.

వీటిని వ్యక్తీకరిస్తూ, వ్యవహరిస్తూ ఉన్నట్టి దివ్యప్రజ్ఞలు (లేక) దేవతలు :
ఇడకు - సోమ (చంద్రుడు). పింగళకు - సూర్యుడు. సుషుమ్నకు - అగ్ని.

ప్రాణశక్తి చలనము

ప్రాణశక్తి  అనుక్షణం ఇడ పింగళ సుషుమ్న లను ముఖ్య వాహకములుగా కలిగియుండి ఆపాదమస్తకమూ దేహమంతటా సంచలనశీలమైయున్నది. అట్టి వివిధ రీతులైన సంచలన ధర్మములను అనుసరించి పంచప్రాణ-పంచ ఉపప్రాణములుగా యోగశాస్త్రములచే విశదీకరించబడుచున్నాయి.

పంచప్రాణముల శరీరాంతర్గత ప్రధాన (విశేష) స్థానములు

(1) ప్రాణము : హృదయమునందు నిత్యము (కేంద్రీకృతమైన) స్థితి కలిగియున్నది.
(2) అపానము : గుద(మల విసర్జక) ప్రదేశములో కేంద్రీకృత సంస్థితము.
(3) సమానము : నాభిప్రదేశములో ముఖ్యస్థానము
(4) ఉదానము : కంఠస్థానము నందు ముఖ్యముగా ప్రవర్తనము కలిగియున్నది.
(5) వ్యానము : శరీరమంతటా ఏర్పడినదై ఉన్నది

ఇవి ప్రధాన పంచ వాయువులు.

పంచ ఉపప్రాణ సంచలనములు

(1) ‘నాగ’ : ఉద్గారే ఆఖ్యాతః : శరీరములోని వ్యర్థవాయువులను, వ్యర్ధ ద్రవములను (ఇత్యాదులు) ‘కక్కు’ వంటి త్రోపులతో బయటకు వెడలుగొట్టు ఉపవాయువు.
(2) కూర్మ :
 ఉన్మీలనే తథా : కనులు తెరచు, మూయు క్రియావిశేషమునకు కారణమగుచున్న ఉపప్రాణము.
(3) కృకర :
 క్షుత్కరో జ్ఞేయో : ఆకలి దప్పికలను ప్రేరేపిస్తూ, తుమ్ము వంటి క్రియా నిర్వహణమునకు కారణము.
(4) దేవదత్త :
 విజృంభతే : వాయు బుడగలను శాసించునది. ఆయా ప్రదేశములలో సందర్భానుసారంగా విజృంభణమును నిర్వర్తిస్తూ శరీరమును పరిరక్షిస్తూ ఉన్నట్టిది.
(5) ధనంజయము :
 ఈ ఉపప్రాణవాయువు సర్వదా జీవుని శరీరమునందు అంతటా ప్రవర్తిల్లుచూ, ఈ జీవుడు దేహమును త్యజించిన తరువాత కూడా వెంటనంటియే ఉండునట్టి ప్రాణశక్తి. సర్వవ్యాపక స్వభావము కలిగి ఉన్నట్టిది. న జహాతి మృతం వాపి। సర్వ వ్యాపీ ధనంజయః।।

ఈ పంచ ఉపప్రాణవాయువులు 72000 నాడులతో ఈ శరీరమునకు ప్రాణాధారములై తిరుగాడుచున్నాయి.

 

జీవుని పరుగులాటలు

ఇక ప్రజ్ఞాస్వరూపుడగు జీవుడు చేస్తూ ఉన్నది ఏమిటి? సమస్త నాడులలో ‘ప్రజ్ఞ’ ( Awareness Consciousness) అను వాహనమును (Vehicle) వెంటనిడుకొని పరుగులిడుచూ ఉన్నాడు. అక్షిప్తో భుజదండేన యథా చలతి కందుకః, ప్రాణాపాన సమాక్షిప్తః తథా జీవో న తిష్ఠతి। రెండు చేతులతో విసరబడుచూ ఉన్న బంతిలాగా ఈ జీవుడు ప్రాణ-అపానములచే తాడనము పొందుచూ దేహములో పైకి క్రిందకు పరుగులు తీస్తున్నాడు. ఎక్కడా ఒకచోట నిలకడ కలిగియుండుటయే లేదు.

అనగా,.. ప్రాణాపాన వశోజీవో హి అధశ్చ ఊర్ధ్వం చ ధావతి। వామ దక్షిణ మార్గాభ్యాం చంచలత్వాత్ న దృశ్యతే! ‘‘ఈ జీవుడు శరీరములో ఎక్కడ మనకు లభించగలడు?’’.. అని వెతకబోతే, ఈతడు ప్రాణ-అపానములకు వశుడై పైకి క్రిందికి వేగముగా చలనములు కలిగి ఉంటూ ఉన్నాడు. ఎడమ-కుడి మార్గములలో (ఇడ-పింగళల) వెంట తిరుగాడుచూ చంచలుడై ఎక్కడా ఒక్కచోట నిశ్చలుడు అవటమే లేదు.

ఎందుచేత?

ఈ జీవుడు గుణబద్ధుడు అగుచుండుటచేత త్రిగుణములచే ప్రచోదితుడగుచూ, ‘‘గుణి - గుణములకు వేరైన జీవుడు’’గా స్వానుభవమునకు లభించటమే లేదు. త్రిగుణములతో కలగాపులగమై ఉంటున్నాడు.

శ్లో।। రజ్జుబద్ధో యథా శ్యేనో గతో ప్రాకృష్యతే పునః
గుణబద్ధః తథా జీవః ప్రాణాపానేన కర్షతి।।
ప్రాణ అపాన వశో జీవః హి అధశ్చ ఊర్ధ్వం
 చ ధావతి।

Like a bird with its leg tied to a rope, so is this Jiva assuming himself tied to Three Gunas

ఒక పొడవైన త్రాడుచే కట్టుకొయ్యకు కాలు ముడి కట్టబడిన పక్షి పైకి ఎగరబోతూ ఇంతలోనే క్రిందకి పడిపోతూ (ఎగిరి ఎగిరి అలసిపోతూ) ఉన్న తీరుగా.., త్రిగుణములకు బద్ధుడైన ఈ జీవుడు కూడా తన ప్రాణ-అపానములు ‘‘ఆకర్షణ’’ అనే త్రాడుచే కట్టుబడినవాడై, వాటికి వశుడై క్రిందకు, పైకి తిరుగాడుచున్నాడు.


ఎవ్వడైతే ప్రాణ-అపానములకు ఆవల స్థానమునందు తనయొక్క చిత్తము - ప్రజ్ఞలను సంస్థితము చేసి, ప్రాణము యొక్క అపాన - ఆకర్షణను, అపానము యొక్క ప్రాణ-ఆకర్షణను ఎరిగి, సాక్షియై గమనిస్తూ.. ఆ ‘‘ప్రాణాపాన పరస్పరాకర్షణ’’ను ప్రాణయోగాభ్యాసము యొక్క సహాయముచే వినోదముగా చూస్తూ, తాను విడిగా ఉండియే దర్శిస్తూ ఉంటాడో, అట్టివాడే ‘యోగవిత్’’ లేక ‘‘యోగవేత్త’’. ప్రాణ-అపానముల సమరసాభ్యాసమే ప్రాణాయామము.


‘‘హంస - హంస’’।

శ్లో।     ‘హ’ కారేణ బహిర్యాతి। ‘స’ కారేణ విశేత్ పునః 

        ‘హంస హంస’ ఇతి అముం మంత్రం జీవో జపతి సర్వదా।।

హ’ అంటూ ఈ జీవుడు ప్రాణముల వెంటగా బయటకు (దృశ్యము అనబడే అన్యమునకు) వెళ్ళుచున్నాడు.

స’ అంటూ తిరిగి అనన్యములోనికి ప్రవేశించుచున్నాడు. ఈ విధంగా జీవుడు ఎల్లప్పుడు రోజుకు 21600 సార్లు తన ప్రాణశక్తి యొక్క వెంటబడుచూ, హంస జపం చేయుచున్నాడు.

(ఇది ‘తత్’ పరమాత్మత్వము నుండి ‘ఇహ’ జీవాత్మత్వమునకు, (ఇహ) జీవాత్మత్వము నుండి (తత్) పరమాత్మత్వమునకు (స)-స్వాభావికంగా జరుగుచున్న అజపా జపము).

అజపా గాయత్రి (సోఽహమ్) (స → హ)

హ’... ‘సహజము’ (లేక) కేవల స్వస్వరూపము నుండి ‘సందర్భము’ లోనికి ప్రవేశము (Entering into an Incident).

స’.. తిరిగి ‘సందర్భము’ నుండి సహజమగు సత్ స్వరూపములో (తనయొక్క కేవల రూపమునకు) పునః ప్రవేశము.
ఇట్టి భావనచే ‘హంస’ జప విధానమును గమనిస్తూ ఉండటము - అజపాగాయత్రి.

‘‘సహజ-సత్’’         →     సందర్భ - ‘హమ్’ (<span style="color:green;">From Original State to Zone of Events and Incidents</span>) 

‘‘సందర్భ-హమ్’’    →     సహజ-‘సత్’ (<span style="color:green;">From Zone of Events and Incidents to Original State</span>) 

అను గమనిక రూపమగు అజపాగాయత్రి ఈ జీవుని పట్ల (తత్ యోగాభ్యాసి పట్ల) మోక్షప్రదాత.

హమ్-సోఽహమ్

‘‘సత్ - సత్’’ → అహం-సత్।
స-సత్ → హ-సత్।
‘‘స’’ (సహజము) → ‘‘హ’’ (సందర్భము)।
‘‘పరమాత్మత్వము → జీవాత్మత్వము’’।

ఈ యానము ప్రతి జీవుని పట్ల స్వాభావికంగా జరుగుచూ ఉంటున్నట్టిదే!

యోగాభ్యాసము → (1) గమనిక-(2) భావనల రూపమైనది. ‘‘సంకల్పము (హ) - సంకల్పించువాడు. (స)’’... లకు సంబంధించినది. అట్టి ‘హంస’ ‘హంస’ భావనాపూర్వక {సంకల్పిత(క) స్మరణచేఊ ఈ జీవుడు సర్వపాపముల నుండి విముక్తుడు కాగలడు.

శ్లో।। అస్యాః సంకల్ప మాత్రేణ సర్వ పాపైః ప్రముచ్యతే।
అనయా సదృశీ విద్యా, అనయా సదృశో జపః,
అనయా సదృశం జ్ఞానం న భూతం న భవిష్యతి।।

అట్టి అజపాగాయత్రికి సంబంధించిన -
పర - ఇహ
కేవల-సందర్భ
సహజ-ఆపాదిత

‘‘హంసో-సోఽహమ్’’ జ్ఞానముతో సమానమైనట్టిది-మరింకేది ఇతఃపూర్వము ఉండి ఉండలేదు. ఇక ఉండబోదు.

 

కుండలిని - కుండలినీ సముద్భూత గాయత్రి

శ్లో।। కుండలిన్యాం సముద్భూతా గాయత్రీ ప్రాణధారణీ
‘‘ప్రాణ విద్యా’’, ‘‘మహా విద్యా’’ యస్తాం వేద స వేదవిత్।

కుండలినీ మహాశక్తి’ యందు జనించిన ప్రాణమును ధారణ చేయు ‘గాయత్రీ ప్రాణ విద్య’ లేక ‘‘గాయత్రీ ప్రాణ మహావిద్య’’ను ఏ యోగి ఎరిగి యుంటాడో ఆతడే వేదవేత్త. తెలుసుకోవలసినది తెలుసుకొనియున్నవాడు.

గుద స్థానంలోగల కోడిగ్రుడ్డు ఆకార మాంస విభాగమగు ‘‘కందము’’నకు ఊర్ధ్వముగా కుండలము ఆకృతిగా అష్టధా (8) ఆకారముగా కుండలినీ శక్తి ప్రకాశమానమై ఉన్నది.

Kundalini

శ్లో।। కంద ఊర్ధ్వే కుండలీశక్తిః అష్టధా కుండలాకృతిః।
బ్రహ్మద్వార ముఖం నిత్యం ముఖేన ఆచ్ఛాద్య తిష్ఠతి।।
(కుండలిని = అష్టవిధ ప్రకృతి = దృశ్య, దేహ, మనో, బుద్ధి, చిత్త, అహంకార, జీవాత్మ, ఈశ్వరాత్మలు)

అట్టి అష్టధా (8) ఆకారము కలిగియున్న కుండలినీశక్తి తన ముఖముతో బ్రహ్మద్వారము (లేక) బ్రహ్మ రంధ్రము యొక్క ముఖమును ఆచ్ఛాదించినదై తిష్ఠించియున్నది. ఈజీవుడు ప్రయాణించవలసిన బ్రహ్మమార్గము ఇదియే.

యేన ద్వారేణ గంతవ్యం బ్రహ్మద్వారమ్ అనామయమ్। ఈ జీవుడు ఏ ద్వారమున వెళ్ళుచూ దేహాత్మత్వమును అధిగమించి విశ్వాత్మత్వముతో మమేకము అగుటకు మార్గమై ఉన్నదో...అదియే ‘‘బ్రహ్మద్వారము’’.

కుండలినీ శక్తియే ‘‘పరమేశ్వరి, జగదంబ, ప్రకృతి, ఉమ’’ ఇత్యాది పేర్లతో యోగవాఙ్మయములో చెప్పబడుచూ ఉన్నది. (Inclination, Inspiration, Enthusiasm).

పరతత్త్వానుభవమునకై ఈ జీవుడు అనామయమైన (నిర్విషయ / విషయాతీతరూపమైన) ద్వారమును సమీపించాలి. కానీ అట్టి కుండలినీదేని (లేక) పరమేశ్వరి (లేక ఇచ్ఛాశక్తి) దేహమునందు (మూలాధారమునందు) కునుకులిడుచున్నది. (ఇంద్రియ దృశ్య ధ్యాసకు పరిమితమై, ఆత్మతత్త్వము విషయమై ఏమరపు కలిగినదై ఉంటోంది). (The intelectual is immersed in and confined to what is being heared, touched, seen, tasted, smelt etc., here and now. " The SELF beyond all" - is not being taken into account)

అనగా..,
ఇచ్ఛజ్ఞాన క్రియాస్వరూపిణియగు ధ్యాస దృశ్యముచే ఆకర్షించబడి, సర్వాత్మకమగు స్వస్వరూపమును గమనించనిదై ఉన్నది.

ఇప్పుడు ‘‘వహ్నియోగము’’ అనే వైతాళికము (Awakening)చే, వాయుప్రేరణ (ప్రాణాయామము) ద్వారా మనస్సుతో ఇచ్ఛాశక్తి రూపమగు కుండలినీదేవిని ప్రబుద్ధము (Enthusiastic, Enlightened, Awakening, Active) చేయాలి.

సందర్భపరిమితత్వము నుండి కేవలము-అపరిమితము-అప్రమేయము’’ అగు స్వస్వరూపానుభవము వైపుగా ఉత్తేజపరచాలి.
ఒక సూచి (సన్నటి లోహపు తీగ)ను సన్నటి గొట్టములో ఈ చివర నుండి ఆ చివర వరకు చేతితో శక్తిని ఉపయోగించి తోసుకువస్తాము కదా!

ఆవిధంగా
- ఈ శరీరము - గొట్టము
- కుండలిని - లోహపు తీగ (సూచి)
- సుషుమ్న - లోగొట్టము / బ్రహ్మమార్గము

ఈ శరీరములో ప్రాణాయామజనిత వహ్నియోగము’ అనే శక్తితో కుండలినీ శక్తిని దేహమునకు మధ్యగా గల సుషుమ్ననాడిలో ప్రవేశింపజేసి, (గొట్టము యొక్క అటు చివర వంటి) శిరస్సుకు ఉపరిభాగమున గల అతి సూక్ష్మమగు బ్రహ్మద్వారము (లేక) బ్రహ్మరంధ్రమునకు చేర్చాలి. సూచీవత్ గాత్రమ్ ఆదాయ వ్రజతి ఊర్ధ్వం సుషుమ్నయా, ఉత్పాటయేత్ కవాటం తు యథా కుంచికయా గృహమ్।। తాళం వేసి ఉన్న ఇంటిలో ప్రవేశించటము కొరకై తాళము చెవితో తాళము తీసి తెలుపులు తెరచిలోనికి వెళ్లుతాము కదా! యోగి ‘‘కుండలీన ఊర్ధ్వయాన యోగాభ్యాసము’’చే - ఈ క్రిందివిధంగా యోగపధమును ‘సాధన’ చేయును గాక। (అభ్యాసి అగును గాక).

  • సుషుమ్న నాడి అనే ద్వారమును సమీపించి....,
  • ప్రాణ -అపానములు అనబడే - వ్రేళ్లను ఉపయోగిస్తూ..,
  • కుండలిని అనే తాళపు చెవితో..,
  • బ్రహ్మద్వారము (లేక) బ్రహ్మరంధ్రము అనే మూసియున్న సన్నటి ద్వారమును (లేక) బ్రహ్మరంధ్రమును తెరచి..,
  • సహస్రారము’ అనే - విశ్వమంతా తనకు అంతర్గతమైయున్న - తనయొక్క స్వస్వరూపాత్మాకాశములో ప్రవేశించి,
  • ఆత్మాకాశమునందు విశ్వాత్మకుడై విహరించుచుండును గాక।

మోక్షమార్గ ప్రవేశమునకై యోగసాధన :

  • కృత్వా సంపుటితౌ కరౌ → రెండు చేతులను సంపుటితముచేసి,
  • దృఢతరం బధ్వాతు పద్మాసనం → దృఢముగా పద్మాసనము ధరించి,
  • గాఢం వక్షసి సన్నిధాయ చుబుకం → చుబుకమును (గడ్డమును) వక్షస్థలము (Heart) పై తాకించి ఉంచి,
  • ధ్యానం చ తత్ చేష్టితమ్ → మనో కదలికలను ధ్యానంచే పరమాత్మయందు నిలిపి,
  • వారంవారం అపానమ్ ఊర్థ్వమ్ → అపానవాయువును పైకిలాగుచూ,
  • అనిలం ప్రోచ్చారితమ్, పూరితమ్ → వాయువుచే పరిపోషించబడుచు, పూరింపబడుచు,
  • ముంచన్ ప్రాణమ్ → ప్రాణశక్తి ఆత్మయందు మునుగునది అగుచుండగా,
  • ఉపైతి బోధమ్ అతులం శక్తి ప్రభావాత్ నరః। → ప్రాణశక్తి ప్రభావము పొందినదై, జీవునికి మహత్తర ఆత్మానుభవము ప్రసాదించగలదు.

ఈ విధంగా ప్రాణ-అపాన ఏకస్వరూపమగు ప్రాణయోగ అభ్యాసము చేస్తూ ఉండగా, అట్టి యోగాభ్యాసికి ‘‘ప్రాణ-అపాన సమరసము’’ చేత జనించిన శక్తి, భావన వలన → బోధ రూపమగు విస్తృత ఆత్మజ్ఞానము సులభమై లభించగలదు.

యోగాభ్యాసి దృష్టిలో ఉంచుకోవలసిన కొన్ని విశేషములు

(1) అంగానాం మర్దనం కృత్వా, శ్రమసంజాత వారిణా : యోగాభ్యాస శ్రమచే జనించిన చెమటను ఆ అంగములకే మర్దించటము చేత యోగతేజస్సు శరీరమునందు అంతర్గతమై ఉండగలదు.

(2) కట్వ ఆమ్ల లవణ త్యాగీ : కారము, పులుపు, ఉప్పు తగ్గించాలి. అప్పుడు యోగాభ్యాసము ప్రవృద్ధమగుచు, సమరసత్వము త్వరగా పరిపుష్టి పొందగలదు.

(3) క్షీరభోజనమ్ ఆచరేత్ : పాలు, పాలతో అన్నము అధికముగా తీసుకొంటూ ఉంటే, అది యోగాభ్యాసమునకు మరింత సానుకూల్యము.

(4) బ్రహ్మచారీ : యోగాభ్యాసి బ్రహ్మమును గురించిన సమాచారము అధ్యయనము చేస్తూ ఉండాలి. ‘‘సమస్తము సర్వదా బ్రహ్మమే’’ - అను దృఢభావనను సర్వ స్థితి - గతులలోను అభ్యాసము చేస్తూ ఉండాలి. ‘‘సమస్తము బ్రహ్మమే కదా!’’ - అని ఆయా అన్ని సందర్భములలో అనుకుంటూ, అనుకుంటూ ఉండటమే ‘బ్రహ్మము’ అను ‘ఆచారము’.

(5) మితాహారో : మితాహారుడై ఉండాలి. ఇంద్రియములకు విషయములే ఆహారము. ఇంద్రియములను మితముగా (As Limited as is Just necessary) విషయ స్వీకారము నందు వినియోగించాలి.
ఈ విధంగా యోగపారాయణుడు
 (Practisioner of Yoga) అయి ఉండగా, ఒక సంవత్సర కాలం దాటగానే అట్టివాడు సిద్ధిని పొందగలడు. ఇందులో అనుమానించవలసినది లేదు.


మితాహారము అనగా?

సుస్నిగ్ధమధురాహారము:

(1) సాత్వికము - మధురమైన కమ్మటి ఆహారము (కారము, ఉప్పు, లవణము, ఆమ్లములు తక్కువగా)

(2) చతుర్దాంశ వివర్జితము : పొట్టలో రెండు వంతులు (1/2) ఘనాహారముతోను, నాలుగవ వంతు(1/4) జలముతోను నింపుచూ,.. శేషించిన నాలుగవ వంతు (1/4) విభాగము వాయువు యొక్క సంచలనమునకై ఖాళీగా ఉంచటము.

(3) శివ సంప్రీత్యము : అది న్యాయార్జితమైన ఆహారమై ఉండుగాక. ఆహారము ప్రసాదించు పరమాత్మకు కృతజ్ఞతగా, తనకు లభించిన ఆహారములోని కొంతభాగము తదితర ఆహారాణ్వేషులగు జీవులకు, జీవరాసులకు సమర్పించటము.

ఈ ఈ లక్షణములు కలిగిఉంటే, అది ‘మితాహారము’ అనబడుతోంది.


కుండలినీ శక్తి

మలవిసర్జకావయవమునకు కించిత్ ఊర్ధ్వంగా (పై వైపుగా) కుండల ఆకృతిగా అష్టవిధంగా ‘‘8’’ ఉన్నది. ఇది జీవునికి బంధము. ఎందుకంటే దృశ్యము పట్ల ఇచ్ఛా - జ్ఞాన-క్రియా తత్త్వమే కుండలినీ శక్తి కాబట్టి. అయితే ఇది మోక్ష ప్రదాత కూడా!
బంధనాయ చ మూఢానాం। యోగినాం మోక్షదా సదా!
 మూఢులకు కుండలనీశక్తియే బంధము.. యోగాభ్యాసులకో, ఇది మోక్షదాయకము.

 

ముద్రలు / బంధనములు

యోగాభ్యాసి దృష్టిలో పెట్టుకోవలసియున్న ముద్రలు (లేక) బంధనములు:
(1) మూలబంధము (2) ఓడ్యాణము (3) జాలంధరము (4) ఖేచరీ (లేక) నభోముద్ర (5) మహాముద్ర.

వీటి వివరణలు చెప్పుకుందాము.

(ఇవన్నీ కూడా అర్ధం చేసుకొని, గురుముఖతః అభ్యసించి నిర్వర్తించబడు గాక! అందుకు యోగ గురువులను ఆశ్రయించాలి).

మూలబంధము :

పార్షిణాఘాతేన సంపీడ్య యోనిమ్ ఆకుంచయేత్ దృఢమ్ = యోని ప్రదేశమును (ఎడమ) కాలి మడమ యొక్క చివరతో దృఢంగా ముడుచుచూ,
అపానమ్ ఊర్ధ్వమ్ ఆకృష్య ‘‘మూలబంధో’’ విధీయతే।। అపానవాయువును మూలాధారమార్గము నుండి వెనుకకు మరల్చి - ధారణ చేసి ఉండటము - ‘‘మూలబంధము’’ - అంటారు.

మూలబంధము’ యొక్క అభ్యాసము నందు ఏర్పడు ప్రాణ-అపానముల ఐక్యతా (సమస్థాన) అభ్యాసముచే →

  • మూత్ర - పురీష (Pissint & Toilet) దోషములు తొలగిపోతాయి.
  • సతత మూలబంధనాభ్యాసముచే వృద్ధుడు కూడా యౌవనోత్సాహవంతుడై ఉండగలడు. ఉరకలు వేయు ఆనందము కలిగి ఉండగలడు.

ఓడ్యాణ బంధము:

ఏ యోగి ఓడ్యాణ బంధము ఎల్లప్పుడూ ధారణ చేస్తూ ఉంటాడో అట్టివాడు పెద్దపక్షి యొక్క ఆకాశ విహారము వలె తేలికైన శరీరము కలవాడగుచున్నాడు. ఈ బంధము ‘మృత్యువు’అనే ఏనుగుకు సింహము వంటిది.

ఉదరాత్ పశ్చిమం తానం అధో నాభేః నిగద్యతే। - కడుపు (Stomach)కు దిగువగా, పశ్చిమము వైపుగా, నాభికి కొంచెము క్రిందుగా గల ప్రదేశమునుతానము’ అంటారు.

ఓడ్యాణమ్ ఉదరే బంధమ్। ఓడ్యాణము’ అనునది (ధ్యాసను ఆజ్ఞాచక్ర ప్రదేశములో నిలిపి, రెండు ముక్కు పుటములతో వేగముగా గాలిని పీల్చి), ఉదరములో (పొట్టలో) నిర్వర్తించే కుంభకప్రాణాయామము. అందుకే ఆపేరు వచ్చింది. (పొట్టలో కుంభము తరువాత, క్రమంగా నెమ్మదిగా రెండు ముక్కు పుటములతో గాలిని ‘రేచకము’ చేయాలి (విడువాలి). (బుద్ధిని హృదయస్థానంలో గాని, ఆజ్ఞాచక్ర స్థానంలోని నిలుపుతూ ఉండాలి).

జాలంధర బంధము :

హి శిరోజాతమ్ అధోగామి నభోజలమ్-తతో జాలంధరో బంధః । శిరస్సులో క్షణక్షణము ఎల్లప్పుడు జనిస్తున్న జలమును శిరోస్థానములో ‘మనోకుంభకము’చే గమనించి, బంధించి అట్టి జలమును అధోముఖం చేసి, కంఠస్థానము వరకు తీసుకురావటము. ఇట్టి బంధము ‘జాలంధరము’ అని పిలువబడుతోంది. కంఠమును సంకోచింపజేసి శిరోజలమును బంధించటము- అను ఈ అభ్యాసములో కంఠప్రదేశ-ముఖ ప్రదేశములలోని సమస్త దోషములు తొలగుతాయి. కంఠసంకోచ ప్రక్రియచే పీయూషము (సంకోచము)చే అగ్నియందు పతనము పొందదు. (అమృతత్వ భావన బాధించబడదు). దేహములోని ఆయా ప్రదేశములలో ఏర్పడగల వాయువు యొక్క అపక్రమములు తొలగుతాయి.

నభో ముద్ర (లేక) ఖేచరీ ముద్ర

ఈ ఖేచరీ ముద్రయందు రెండు మెట్లతో కూడిన అభ్యాసములు. (ఒకేసారి అభ్యాసము చేయబడవలసినవి).

(1) కపాల కుహరే జిహ్వా ప్రతిష్టా విపరీతగా- బ్రహ్మ రంధ్రముయొక్క ఈవలి చివర, కపాల కుహరము - అయినట్టి కొండనాలుక చిట్టచివరకు - నాలుకను క్రమక్రమాభ్యాసంగా మడచి, నాలుక యొక్క చిట్టచివరతో కొండనాలుక రంధ్రమును స్పృశించటము.

(2) భృవోః అంతర్గతా దృష్టిః।- భ్రూమధ్యలోని (భృకుటి మధ్యగా / కనుబొమ్మల మధ్య ప్రదేశములోని) ఆకాశములో దృష్టిని నిలిపి ఉంచటము.

(ఇతి) ముద్రాభవతి ఖేచరీ। - ఇది ‘ఖేచరీముద్ర’ - అనబడుతోంది. ఈ ఖేచరీ ముద్రవలన రోగములు సమీపించవు. మరణ సందర్భములో ప్రజ్ఞ (తెలివి) కొనసాగుచూ, మరణము జయించబడగలదు. అమృతత్త్వము సిద్ధించగలదు. ఖేచరీ ముద్ర యొక్క ధారణస్థితి సిద్ధించుకొనువానికి ఆకలి దప్పికలు బాధించవు. ‘మూర్ఛ దశ’కు లోను కాడు. అట్టివాడు శారీరక -మానసిక రుగ్మతల చేతగాని, కర్మలచేతగాని, మరింక దేనిచేతగాని బాధించబడడు. పీడ్యతే న చ రోగేణ, లిప్యతే న చ కర్మభిః। బాధ్యతే న చ కేనాపి, యో ముద్రాం వేత్తి ఖేచరీ।

అంతేకాదు. చిత్తము భ్రూమధ్య-అంతర్గతాకాశమునందు, జిహ్వ (నాలుక) కపాల కుహర స్థానమునందు ప్రవేశించుటను సిద్ధించుకొన్న యోగులు సిద్ధులచేత కూడా నమస్కరించబడుచూ ఉంటారు.

శరీరభావన ఖేచరీ అభ్యాసముచే బిందుమూలమునందు సిరా (శ్రేష్ఠము) రూపమై ప్రతిష్ఠితిమగుచున్నది. శరీరమంతా ఆపాదమస్తకము ఆత్మాకాశభావనచే ఆక్రమించుకొనటము జరుగగలదు. ఇట్టి లంబికా ఊర్ధ్వ యోగముచే బిందువు క్షీణించదు. (‘‘ధ్యానము, పూజ’’- చేయువాడు ఆ ధ్యాస నుండి చ్యుతి పొందడు). సమస్తము సర్వదా ఆత్మబిందువునందు దర్శించు స్థితి నుండి బుద్ధి చెలించదు. కామినీ ఆలింగనముచే (ప్రాపంచకమైన విషయములతో తత్పరమగుటచే) కూడా ఆత్మసాక్షాత్కార ఏకాగ్రత క్షణము కూడా విరామము పొందదు. అట్టి బిందుస్థానమునందు(ఆత్మభావన యందు) దేహము స్థితి పొందుచుండగా, ఆ యోగి అమృతస్వరూప-స్వభావుడు అగుచున్నాడు. ఆతనికిక మృత్యు భయముండదు. మృత్యువు కూడా ఆతని పట్ల ‘‘నిద్రపోయి-లేవటమువంటి సాధారణ విషయము’’వలె అగుచున్నది. (బిందువు = నిర్విషయ కేవలాత్మ. జగత్తు బిందువులచే నిర్మితము).

 నభోముద్ర ధారణ కొనసాగునంతవరకు - ఆయోగి పట్ల అగ్నిచే జ్వలించబడుచున్నప్పుడు కూడా బిందుసంప్రాప్తి (ఆత్మధ్యాస) కొనసాగుచూనే ఉండగలదు.

యోగముద్రచే ప్రాప్తించు యోగశక్తిచేత జీవుడు అధోగతి నుండి (ఆజ్ఞాచక్ర స్థానమునకు క్రిందకు పోవుగతి, ‘రీ’ పంచేంద్రియ విషయగతి - నుండి) ఊర్థ్వగతిని (ఆజ్ఞాచక్రము నుండి మస్తకాకాశము, బ్రహ్మరంధ్రము, సహస్రారము వైపు గతిని ‘↑’), సముపార్జించుకొనుచున్నాడు.

 

మహాముద్ర

బిందుస్థానము : ఈ బిందుస్థానము రెండు విధములైనవిగా ఉంటున్నది.
(1) పాండరము : ఇది ‘శుక్లము’ సంబంధమైనది. శశిస్థానము చంద్రతత్త్వము / స్థానము.
(2) లోహితము : మహారజరూపము. సిందూర వ్రాతసంకాశం రవిస్థానం స్థితం రజః। ఎర్రటి (సిందూర)సముదాయ
సమానము. స్థానము - రవి (సూర్య) తత్త్వము / స్థానము.
బిందుః ఇందూ, రజో రవిః।।

శ్లో।। బిందుః బ్రహ్మ-రజః శక్తిః। బిందు ఇందుః రజోరవిః
ఉభయోః సంగమాత్ ఏవ ప్రాప్యతే పరమం పదమ్।।

ఈ చంద్ర సూర్యుల తత్త్వమగు శుక్ల-రజముల కలయికయే (పురుష-ప్రకృతుల పరస్పర అద్వితీయత్వమే) పరమపదము. ఈ రవిస్థాన స్థితమైన రజము - శశిస్థానస్థితమైన శుక్లముల ఐక్యత బహు దుర్లభము. అదియే పరమపదము. ఇహ-పరములు, సందర్భ-సహజములు, జీవాత్మ-పరమాత్మలు ఏకతత్త్వముగా సంతరించుకోవటమే - ‘‘రజో-బిందు ఏకత్వము’’.

శ్లో।। వాయునా శక్తి జాతేన ప్రేరితం చ యథా రజః,
యాతి బిందుః సదైకత్వం భవేత్ దివ్య వపుః తదా।।

శక్తి’ చేత జనించిన వాయువుచే ‘రజస్సు’ ప్రేరితమయినదై, ‘బిందువు’తో ఐక్యమై, తత్ఫలితంగా దివ్యదేహము రూపుదిద్దుకొనుచున్నది. ప్రాణాయామముచే కుండలినీ శక్తి ప్రేరితమై ఈ జీవుడు శివత్వము సంతరించుకొనే ఉపకరణముగా అగుచున్నది.

ప్రాణాభ్యాసముచే జనించిన యోగశక్తి ప్రేరితమై - ‘‘నాది’’ అనురూపమగు ప్రకృతి- ‘నేను’ అను బిందువు నందు ఐక్యమొందుచున్నది. ఆ యోగి భౌతిక - మనో-బుద్ధి-చిత్తరూపములను అధిగమించి కేవలాత్మానంద-దివ్యశరీరుడు, అఖండానంద ఆత్మదేహుడు అగుచున్నాడు.

శ్లో।। శుక్లం చంద్రేణ సంయుక్తం, రజః సూర్యేణ సంగతమ్
తయోః ‘‘సమరస ఏకత్వం’’ - యోజానాతి, స యోగవిత్।।

        చంద్రునితో కలిసిన శుక్లము     సూర్యునితో కలిసిన రజము 

        పురుషుడు / అనుభవి           పురుషకారము / అనుభవము

 

              ఈ ఉభయముల సమరస ఏకత్వము ఎరిగినవాడే వేదవేద్యుడు.

అట్టివాని ఇహ-పరములు ‘‘పరాత్పరత్వము’’నందు ‘ఏకత్వము’ పొందగలవు.

‘‘మహాముద్ర’’ అనగా? 

(1) నాడీజాలము యొక్క ‘‘శోధనము’’ (ప్రాణాయామము, షట్‌చక్రములలోను, నవరంధ్రములలోను సహజ కుంభకము        మొదలైనవి) 

(2) చంద్రసూర్యుల ‘‘చాలనము’’ (ద్రష్ట - దర్శనముల ఏకత్వము) 

(3) రసముల ‘‘శోషణము’’ (నవరసములను ఆత్మపురుషుని విశేషణములుగా సందర్శనము)

 

ఈ (1) శోధన (2) చాలన (3) శోషణ - త్రయమే ‘‘మహాముద్ర’’.

శోధనము

శ్లో।। వక్షో న్యస్త హనుః నిపీడ్య సుచిరం, యోనిం చ వామాంఘ్రిణా,
హస్తాభ్యామ్ అనుధారయన్ ప్రసరితం, పాదం తథా దక్షిణమ్,
ఆపూర్య శ్వసనేన కుక్షియుగళం బధ్వా శనైః రేచయేత్।।

  • గడ్డమును వక్షస్థలముపై ఇష్టముగా ఆనించిఉంచి,
  • ఎడమకాలి మడమ (వెనుక) భాగంతో యోని ప్రదేశమును నొక్కి ఉంచి,
  • కుడికాలిని ముందుకు సూటిగా చాపి ఉంచి,
  • చాపిన కుడికాలిని చేతి వ్రేళ్లతో పట్టుకొని ఉండి,
  • శ్వాసించుగాలిని కుక్షియగళములో (పొట్టలో) పూరించి, బంధించి (కుంభకముచేసి) ఉంచి,
  • మెల్లగా ఆ వాయువును వదలాలి (రేచకము చేయాలి).

ఇది నాడీజాల శోధనము. ఇది బుద్ధిమంతులగు యోగులు అభ్యసించు ముద్రావిశేషము (లేక) యోగాభ్యాసము.

- - -

చంద్రాంశ’తో (ఇడతో) ఒకసారి, ‘సూర్యాంశ’తో (పింగళతో) మరొకసారి రేచక-పూరక-కుంభక-పునఃరేచక ప్రాణాయామము అభ్యాసము చేయాలి. ఈవిధంగా అభ్యసిస్తూ ఉండగా రేచక పూరక కుంభక పునఃరేచక సమయము సమము (స్వాభావికము) అగుచున్నది. యా తుల్యా తు భవేత్ సంఖ్యా తతో ముద్రాం విసర్జయేత్।। సంఖ్యా సమత్వము సిద్ధించిన తరువాత ఇక పైన చెప్పిన ముద్రతో పని ఉండదు. ఆ ముద్రను విసర్జించివేయాలి. (స్వాభావికత సిద్ధించిన తరువాత ఇక విధి విధానములతో పని ఉండదు).

ఇట్టి మహాముద్ర అభ్యసించే యోగికి → - ఇది తినాలి (పథ్యము) - ఇది తిన కూడదు (అపథ్యము) అను నియమ - నిష్టలతో పని ఉండదు.
- రసము - నీరసము మొదలైనవి అట్టి యోగాభ్యాసి పట్ల ఉండజాలవు.
- ఆతని పట్ల-అతి ఆహారము జీర్ణమవగలదు. (ఇంద్రియ విషయములందు, ప్రాపంచక వ్యవహారములందు పుంఖానుపుంఖ సంబంధ - అనుబంధ- బాంధవ్యములందు పాల్గొనవలసి రావటము) - అత్యంత సులభంగా, స్వాభవికంగా (స్వస్వరూపభావన యందు) లయమవగలవు. ఘోరమైన విషము కూడా ఆతని పట్ల అమృతతుల్యమగుచున్నది.

ఇంకా కూడా ‘మహాముద్ర’ను అభ్యసించువారి పట్ల - క్షయ, కుష్ఠు, గుదావర్తము (గుదములో మంట, మొల్లలు మొదలైనవి), గుల్మము (హృదయమునకు ఎడమ భాగములో ఉండు పచ్చని మాంస ఖండములో దోషములు), అజీర్ణము మొదలైన వ్యాధులన్నీ తొలగిపోగలవు.

యోగులకు సర్వసిద్ధికరమగు ఈ ‘మహాముద్ర’ను గురుముఖతః నేర్చుకుని శ్రద్ధగా ఉపాసించాలి. తాను అభ్యసిస్తూ అర్హత ఉన్న వారికి సూచించాలి. అయితే రహస్యంగా ఉంచాలి. క్రోధ లోభ మద మాత్సర్యములు కలవారికి బోధించరాదు. శిష్యత్వ, సేవకత్వ సుగుణముల, లోకక్షేమాశయముల అర్హత చూడకుండా ప్రసాదించకూడదు.

- - -

ఓంకారోపాసన

ప్రియ యోగాభ్యాసులారా! శ్రోతలారా! శిష్యజనులారా! ఇప్పటివరకు ఆయా ముద్రల గురించి, వాటి అభ్యాస ప్రయోజనముల గురించి ఆయా కొన్ని విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాము కదా!

ఇప్పుడు ‘ఓంకారము’ యొక్క సులభమగు ఒక ఉపాసన గురించి ధ్యానాభ్యాసరతులను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటున్నాము.

శ్లో।। పద్మాసనం సమారుహ్య సమకాయ - శిరో ధరః।
నాసాగ్రదృష్టిః ఏకాంతే జపేత్ ‘ఓం’ కారమ్ - అవ్యయమ్।।

  • పద్మాసనము ధరించి,
  • శరీరమును శిరస్సును మెడను నిలువుగా ధారణ చేసి,
  • ముక్కుకు పై భాగమున గల కనుబొమ్మల మధ్య గల ఆజ్ఞాచక్రాకాశములో దృష్టిని నిలిపి,
  • ఆత్మకు అన్యమైన సమస్త విషయములను వదలి, ఏకాత్మకమగు స్థాన-భావనలతో అవ్యయమగు (పెరుగట - తరుగుట, మార్పు-చేర్పు ధర్మములు కించిత్ కూడా ఏ మాత్రము లేనట్టి) ఆత్మకు సంజ్ఞ - అక్షరార్ధము అగు ‘ఓం’ కారమును జపించాలి.

ఓం’ అనగా?

  • ఏది త్రికాలములో నిత్యమైయున్నదో, సత్యమైయున్నదో,
  • ఎద్దానికి దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములు ఏ మాత్రము స్పృశించక తాను సర్వదా ‘‘శుద్ధము’’ అయి ఉన్నదో..,
  • ఏది కేవలబుద్ధి స్వరూపమై ‘బుద్ధము’ అనబడుచున్నదో..,
  • సమస్త కల్పనలకు ఆవల సర్వదా నిర్వికల్పమైయున్నదో...,
  • దోష రహితమగుటచే నిరంజనమో,
  • మాటలతో నిర్వచించి చెప్పజాలము కాబట్టి నిరాఖ్యాతమో,
  • దేహాదులవలె ఆది- అంతము లేనట్టిది కాబట్టి అనాది నిధనమో,
  • సర్వదా అఖండమై, ఏకమై, అక్షరమై యున్నదో..,
  • ఏది భూత-వర్తమాన - భవిష్యత్తుల రూపమును దాల్చుచూ ఒక నటుడు పాత్రలు వహిస్తున్నట్లు ప్రవర్తిల్లునదై ఉన్నదో,
  • సర్వదా అవిచ్ఛిన్నమై కేవల రూపంగా ప్రకాశమానమైయున్నదో..,
  • సమస్తమునకు ఆవల పరబ్రహ్మమై సమస్తమును ప్రకాశింపజేయుచున్నదో.
  • అదియే ‘ఓంకారము’ యొక్క తాత్పర్యార్ధము. అదియే ‘పరాశక్తి’ అని, స్వయం జ్యోతిరాత్మకమని గమనిస్తూ, ఓంకారోపాసన ఆశ్రయించబడు గాక!

ఆత్మ నుండి సృష్టి

పరాశక్తి. స్వయం జ్యోతిస్వరూపము. శ్రోత - వ్యాఖ్యాతల సహజ - కేవల స్వస్వరూపము అయినట్టిది. ఆత్మ నుండే ఈ సమస్త దృశ్య వ్యవహారము బయల్వెడలుచు, ప్రవర్తనశీలమై, తిరిగి (జలంలో తరంగములవలె) ఆత్మ యందే అనన్యరూపంగా సశాంతించుచున్నది.

ఆత్మన → ఆకాశాత్ సంభూతః - జలములో సంచలనమువలె - ఆత్మ నుండి అవకాశ స్వరూపమగు ‘ఆకాశము’ సంభూతమగుచున్నది.

ఆకాశము నుండి → వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి → ఆపః (జలము/ద్రవము), ఆపః నుండి పృధివి (స్థూలము) - ప్రదర్శనమగుచున్నాయి.

అట్టి పంచభూతములకు అధిపతులు ఐదుగురు.
(1) సదాశివ (2) ఈశ్వర (3) రుద్ర (4) విష్ణు (5) బ్రహ్మ.

బ్రహ్మ విష్ణు రుద్రులు → ఉత్పత్తి స్థితి లయ కర్తలు

బ్రహ్మ - రాజస గుణ ప్రధానుడు. విష్ణువు - సాత్విక గుణ ప్రధానుడు. రుద్రుడు - తామస గుణ ప్రధానుడు.

త్రిమూర్తులు ఈ విధంగా త్రిగుణ ప్రదర్శనయుక్తులై ఉన్నారు. దేవతలకు మునుముందుగా - ప్రధమంగా సృష్ట్యభిమాని అగు బ్రహ్మదేవుడు సంభవించుచున్నారు.

సృష్టియందు → ధాత। (బ్రహ్మ), స్థితి యందు → విష్ణువు, నాశనము నందు → రుద్రుడు, భోగమునందు ఇంద్రుడు - సమస్తమును ముందుగా సంప్రదర్శనమగుచున్నారు.

 

స్థూల ప్రకృతి

వీరిలో బ్రహ్మదేవుని సృష్టి సంకల్పము నుండి లోకములు, దేవ - జంతు - నర - స్థావరములు మొదలైనవి జనించుచున్నాయి. వీరిలో మనుష్యులు మొదలై దేహములలో -
- పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,
- పంచ ప్రాణములు, మనోబుద్ధి - చిత్త అహంకారములు →
- ఇవన్నీ స్థూలముగా కల్పించబడుచున్నాయి. ఇది ‘‘స్థూల ప్రకృతి’’ అనబడుచున్నది.

లింగము

వీటిలో జ్ఞాన కర్మేంద్రియ సంబంధమైన జ్ఞాన విషయములు, ‘ప్రాణము’ మొదలైన ప్రాణ పంచకము, మనోబుద్ధులు సూక్ష్మరూపములై ఉంటున్నాయి. అట్టి సూక్ష్మ విశేష సముదాయము - ’లింగము’ అని చెప్పబడుతోంది.
(ఉదా : చూడబడునది → స్థూలము. చూపు → సూక్ష్మము. వినబడునది → స్థూలము. వినటము → సూక్ష్మము.

కారణము

సత్వ రజో తమో త్రిగుణములు ‘కారణ శరీరము’ అనబడుచున్నాయి. ఈ విధంగా ఈ జీవుని పట్ల (1) స్థూల శరీరము (2) సూక్ష్మశరీరము (3) కారణ శరీరము అని పిలువబడు మూడు శరీరములు ఏర్పడుచున్నాయి. అవన్నీ ఒకే సమయ సందర్భములలో ప్రవర్తనశీలమై ఉంటున్నాయి.

అవస్థలు - (1) జాగ్రత్ (2) స్వప్న (3) సుషుప్తి (4) తురీయము

అవస్థల యొక్క అధిపత / అభిమాన - పురుషకారములు / పురుషులు
(1) జాగ్రత్ → విశ్వపురుషుడు. → విశ్వోహి స్థూలభుక్ నిత్యమ్। స్థూల తత్త్వాభిమాని - విశ్వుడు.
(2) స్వప్నము → తేజస పురుషుడు → తైజసః ప్రవివిక్త భుక్ । ఏకాంత కల్పనకు సంబంధించినట్టి ‘‘రహస్య భుక్’’-తేజసుడు.
(3) సుషుప్తి → ప్రాజ్ఞ పురుషుడు → ఆనంద భుక్ తథా ప్రాజ్ఞః। ‘ఆనందానుభవుడు’ - ప్రాజ్ఞుడు.
(4) తురీయము → తురీయ పురుషుడు → ‘సర్వసాక్షి’ ఇతి అతః పరః। జాగ్రత్ స్వప్నసుషుప్తులకు వేరై, వాటివాటికి కేవల సాక్షి అయినట్టి పురుషకారము - తురీయము.

ప్రణవము : సర్వబాహ్యముల అనుభవ రూపములుగా, అంతరంగ సమస్త తత్త్వములుగా ప్రతిష్ఠితమైయున్న పరమార్ధము. ప్రణవః సర్వదా తిష్ఠేత్ సర్వ జీవేషు భోగతః।।(The totatility of the self + the self related experiencing details here and ever put together is "PRANAVAM"). స్థూల, సూక్ష్మ, కారణ తురీయ పురుషులను నాలుగు ముఖములుగా కలిగియున్న కేవలాత్మకు సంజ్ఞ - (‘చతుర్ముఖబ్రహ్మ’గా పౌరాణిక నామధేయము)

అభిరామము (ఆత్మారామము) అదోముఖమై సర్వత్రా ద్రష్ట - దర్శన దృశ్య రూపములతో సహా (జాగ్రత్-స్వప్న సుషుప్తి-తురీయ) సర్వ అవస్థల యందు అవస్థితమైయున్నది..

అ : ఉ : మ :   -   ప్రణవాంతర్గత త్రయము. త్రయోవర్ణములు 

ఋక్   యజు   సామ   -   త్రయీ వేదములు 

భూ  భువర్     సువర్     -   త్రయీ లోకములు 

రజో   సత్త్వ  తమో   -   త్రిగుణములు

ఇంకా మూడు అక్షరములు, మూడు స్వరములు (మంద్రము - మధ్యమ - ఉచ్ఛస్వరము), జ్ఞాతృ - జ్ఞాన - జ్ఞేయములు


ఈ ఈ సర్వముగా, సమగ్రంగా చెప్పబడు సంజ్ఞాక్షరము ‘ఓం’కారము. ఆత్మకు కూడా ‘సంజ్ఞ’. 


అ’కారో జాగ్రతి నేత్రే వర్తతే సర్వజంతుషు।

వ్యష్ఠి పూర్వకంగా :

అ’కారము - జాగ్రత్. సర్వజీవుల నేత్ర స్థానము నందు (కళ్ళలో) వర్తించునదై ఉంటోంది.
ఉ’కారము - స్వప్నము - కంఠస్థాన వర్తనము.
మ’కారము - సుషుప్తి- హృదయ స్థానము.

సమిష్ఠి పూర్వకంగా: విరాట్ - స్థూలాకారము - ‘అ’ కారము.
హిరణ్యగర్భః - తైజస - సూక్ష్మము - ‘ఉ’ కారము.
కారణ అవ్యాకృతము - ప్రాజ్ఞః - ‘మ’ కారము.

ఇంకా కూడా...,
అ’కారము - రాజస. వర్ణము = రక్తము. బ్రహ్మ చేతనము.
ఉ’ కారము - సాత్త్విక. వర్ణము = తెలుపు. విష్ణు చేతనము.
మ’కారము - తామస. వర్ణము = కృష్ణము (నలుపు). రుద్ర చేతనము.

సర్వము ప్రణవము నందే ప్రభవించి ప్రణవము నందే లయించుచున్నది.

ప్రణవము నందే →
బ్రహ్మా హరి రుద్రులు ప్రభవించుచూ.., ప్రణవ (లేక) పర స్వరూపులై ఉండి (జలమునందు తరంగములవలె) తిరిగి ప్రణవమునందే సశాంతిస్తున్నారు.
బ్రహ్మా - ‘అ’కారము నందు, విష్ణువు - ‘ఉ’ కారమునందు, రుద్రుడు - ‘మ’కారమునందు లీనమగుచున్నారు. సర్వే సర్వత్రా ప్రణవమే సమస్తముగా ప్రకాశమానమైయున్నది.

ఉన్నది బ్రహ్మమే। బ్రహ్మమునకు అన్యముగా ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా ఏదీ లేదు. అదియే ప్రణవము.

అట్టి ప్రణవము = జ్ఞానినామ్ ఊర్ధ్వభాగో అభూత్। అజ్ఞానే స్యాత్ అధోముఖః’’
జ్ఞానులకు ఊర్థ్వభాగమున అనుభవమగుచున్నది. (ఆజ్ఞాచక్రమునందు, అక్కడి నుండి బ్రహ్మద్వారము (లేక) బ్రహ్మరంధ్రము వరకు, బ్రహ్మరంధ్రమునకు ఉపరిగా సహస్రారమునందు - ఆత్మగా అనుభవమగుచున్నది). ↑
అజ్ఞానులకు అధోముఖముగా ఆజ్ఞాచక్రమునకు క్రింద వైపుగా అనుభవమగుచున్నది. ఇంద్రియ ద్వారముల యందు ఇంద్రియ ప్రజ్ఞలుగాను, ఇంద్రియములుగాను, బయల్వెడలి, అవి వ్రాలుచున్న విషయముల రూపంగా, అనుభవమగుచున్నది. రీ

అట్టి బాహ్య - అభ్యంతర స్థితమైయున్న బ్రహ్మము నందు సుతిష్ఠితుడు (Well - placed) అయి, సర్వత్రా సందర్శనము చేస్తూ, అట్టి స్వస్వరూప - సమస్త స్వరూప ఏక అఖండ బ్రహ్మమును తనకు అనన్యముగా ఎరిగినవాడే వేదవేత్త।

ఊర్ధ్వగామి - ప్రణవము

ఊర్ధ్వగామి - ప్రణవము

దేహములోని షట్‌చక్రములతో కూడిన (బ్రహ్మదండము - అని పిలువబడు) వెన్నెముక యందు అంతటా గల అనాహతము (హృదయచక్రము) నందు ప్రణవము ఊర్ధ్వగామి (Upwardly moving) గా ఉంటుంది. అట్టి ప్రణవము యొక్క ధ్వని దీర్ఘ ఘంటానినాదము (టంగ్... టంగ్) వలెను, అవిచ్ఛిన్నమగు తైలధారవలెను, ధ్యాసకు అనునిత్యమై, అనుక్షణికమై ఉంటుంది. ప్రణవస్య ధ్వనిః తద్వత్ అగ్రం బ్రహ్మ చ ఉచ్యతే।

అట్టి ప్రణవనాదమునకు ఆవల (అగ్రముగా) పరమార్థమై ఏర్పడియున్న (సమస్తమును కదిలించే - శబ్దీకరించే) చైతన్యమే ‘బ్రహ్మము’ అనబడుచున్నది. అట్టి నాదమును అగ్రముగా గల బ్రహ్మము →
- జ్యోతిర్మయము. సమస్తము తన యొక్క వెలుగుచే
 (By Virtue of its Enlightenment and Entertainment) నింపివేయుచున్నట్టిది.
- సూక్ష్మమగు బుద్ధికి మాత్రమే అనుభవరూపము. నోటితో ‘ఇది’ అని నిర్వచించజాలనిది. అవాచ్యము.

ఏ మహాత్ములు అద్దానిని ఎరిగినవారై ఉన్నారో వారే విదితవేద్యులు. అట్టి ‘బ్రహ్మము’ను వేదవేత్తలు - ‘‘అహమ్,త్వమ్,జగత్’’ అనే వాటికి స్వస్వరూప బ్రహ్మమే మూలపదార్థము వంటిదిగా - అనునిత్యానుభవులై ఉంటున్నారు. ఇది - సమస్త ఆభరణములకు బంగారమే మూలపదార్థముగా అవటము వంటిది.

హంస (సోఽహమ్) : జాగ్రత్ నేత్ర ద్వయోర్మధ్యే హంసయేవ ప్రకాశతే। జాగ్రత్ నేత్రముల రెండింటి మధ్యగా ప్రకాశించుచున్నది హంసయే (ఆత్మయే)।

స’కారము (సత్-ఉనికి యొక్క కేవలానుభవము) - ఖేచరీ’ అనబడుచున్నది. ‘‘ఉన్నదంతా సత్‌స్వరూప పరబ్రహ్మమే. ‘త్వమ్’గా సూచితమయ్యేదంతా (నీవు- నీవు అనబడుచూ ఉన్నదంతా) ‘తత్’ స్వరూపమే’’ - అను నిశ్చయమే - ‘సదోపాసన’.
(ఖః = ఆత్మాకాశము. చరీ = అట్టి ఆత్మయందు చరింపజేయు ముద్ర).

హ’కారము = ‘హ’ కారార్ధమే జీవుడు. ‘స’కారార్ధమే పరమేశ్వరుడు. ‘తత్’ యే త్వమ్. ‘త్వమ్’యే తత్।

స’కారమును (జీవాత్మను) తత్ బ్రహ్మముగా (తత్ త్వమ్‌గా) ధ్యానించువాడు. - సోఽహమ్ (అహమ్ తదేవ) స్థానమును సిద్ధించుకొనుచున్నాడు.

అనగా : ‘‘నీవు బ్రహ్మమే’’ అను సర్వకాల సర్వావస్థల అభ్యాసముచే ‘‘నేను బ్రహ్మమే’’ అనునది సిద్ధించుకొనబడుచున్నది.
(తత్ = త్వమ్ - సాధన. సోఽహమ్ = సిద్ధి)

- - -

‘‘బంధము’’ అనునది ఎట్లా రూపము పొందుతోంది?

ఇంద్రియైః బధ్యతే జీవః। ఆత్మాచ ఏవ న బధ్యతే।। ఇంద్రియ వ్యాపారములు నిర్వర్తించుచుండగా, ఇంద్రియ విషయముల పట్ల ఏర్పడిన అనుబంధ - సంబంధ-బాంధవ్యములచేతనే జీవునకు ‘‘నేను బద్ధుడను’’ అని అనిపించటం జరుగుతోంది. జీవుడు స్వతఃగా ఆత్మ (తత్) స్వరూపుడే. ఆత్మగా ఈజీవునికి బంధ మెక్కడిది? లేనే లేదు.

సందర్భమాత్రమగు జీవాత్మగా ముక్తి లేదు. 

కేవలమగు ఆత్మగా బంధము లేదు.

జీవాత్మ = పరమాత్మ పట్ల కల్పితము, సందర్భ పరిమితము మాత్రమే! (ఆకాశంలో సూర్యుడువంటి వాడు - ‘పరమాత్మ’. జలంలో ప్రతిబింబిచే సూర్యుడువంటివాడు - ‘జీవాత్మ’.

జీవుడు - కేవలుడు

(అహమిత్యేవ బంధాయ। నాహమిత్యేవ మోక్షయే।) ‘‘ఇది నాది. నాకు చెందినది. నేను చేస్తున్నాను. నాకు సంబంధించినది. వీరు నావారు. నేను వీరికి చెందినవాడను’’ - అనునదే ‘‘మమత్వము’’.

మమత్వేన భవేత్ జీవో। నిర్మమత్వేన కేవలః।। మమత్వము చేతనే (పరమాత్మ స్వరూపుడై కూడా) ఈతడు జీవుడు అగుచున్నాడు.
‘‘మమకారము’’ అనే భ్రమ తొలగిందా, ఇక ఈ జీవుడు కేవల స్వరూపుడై, ‘‘కైవల్యము’’ సిద్ధించుకొనుచున్నాడు. ‘‘నాది’’ అనునది ప్రక్కకు పెట్టి చూస్తే, ఈ ‘‘నేను’’ (లేక నీవు) బ్రహ్మము కాని క్షణమే లేదు.

ఓంకార ‘సంజ్ఞ’యగు కేవలాత్మ (లేక) స్వస్వరూపాత్మ యొక్క అంశలు (లేక) మాత్రలు : ఈ భౌతికమగు భూలోకము, మనో నిర్మితమగు భువర్లోకము, దివ్య-దేవతాంశలగు సువర్లోకము, (అట్లాగే) సోమ సూర్య అగ్ని దేవతలు... ఇవన్నీ ఎద్దాని యొక్క అంశలు / మాత్రలు అయిఉన్నదో, అట్టి ఓంకారార్ధ పరమాత్మయే ఇదంతా.

[ ఓం = Exhibitor of matter (భూ) + Thought (భువః) + Thinker (సువః) ]

అట్లాగే,
క్రియ-ఇచ్ఛ - జ్ఞానములు, వాటివాటి అధి దేవతలగు బ్రాహ్మీ, రౌద్రీ, వైష్ణవీ జగన్‌మాతలు - ఈ మూడు రీతులైన మాత్రాస్థితిస్థానము ఎచ్చట ఏర్పడిఉన్నవో,.. అదియే పరంజ్యోతి స్వరూపమగు
 ఓం’.

జపము - నమస్కారము

వచసా తత్ జపేత్ నిత్యం। వపుషా తత్ సమభ్యసేత్। నిత్యము వాక్కుతో అట్టి పరంజ్యోతి స్వరూపమునకు నమస్కరించాలి.

అక్షరరూపమగు ‘ఓం’నే భావనాపూర్వకంగా జపించాలి. శరీరముతో సేవించాలి. సమస్తమును ఓంకార స్వరూపులుగా భావనచే భావించాలి. ‘‘సమస్తము సర్వదా ‘ఓం’ కారపరబ్రహ్మ స్వరూపమే కదా’’ అను నిశ్చలమగు నిశ్చయమును ఆశ్రయించి ఉండాలి.

ఏకమగు ఆత్మ (ఓం)యే అనేకముగా ప్రదర్శనమగుచూ, సర్వదా తన ఏకాత్మత్వము వీడకయే ఉన్నది - అనునదే ఓంకారోపాసన।
- మనస్సుతో అట్టి పరంజ్యోతి స్వరూపమగు ‘ఓం’నే మననము చేస్తూ ఉండాలి.

అస్పృశ్యత

ఈ విధంగా ఎవ్వడైతే - శుచిగా గాని, అశుచిగాగాని ఎల్లప్పుడు అట్టి ప్రణవమును జపిస్తూ ఉంటాడో,.. అట్టివాడు తామరాకును నీరు అంటని విధంగా పాపపుణ్య ద్వంద్వములచే స్పృశించబడడు.

  • వాయువు చలిస్తూ ఉంటే, బిందువు (ఏకాగ్రమగు ఆత్మ భావన)కూడా చంచలము అయిపోతూ ఉంటుంది.
  • (ప్రాణ - అపానముల ఏకస్థాన ధారణా - అభ్యాసముచే) వాయు నిశ్చలత్వముచే బిందువు (ఆత్మభావనా ఏకాగ్రత) కూడా నిశ్చలమవగలదు.
  • వాయు నిరోధ అభ్యాసముచే (ప్రాణాయామ అభ్యాసముచే, కుంభకాభ్యాసముచే) యోగి ఆత్మనిశ్చలరూపమగు స్థాణుత్వము పొందుచున్నాడు.

ఎంతెంతవరకు ప్రాణ-అపాన సమరసాభ్యాసముచే వాయువు దేహములో నిశ్చలమగుచున్నదో, అంతంత వరకు ఆ యోగి దృశ్య వ్యవహారములలో తన్మయుడై మునుగడు.

వాయు నిరోధము సిద్ధించుకొన్నవాడు - దేహముల రాకపోకలతో సహా ఈ సమస్తమునకు అతీతుడౌతాడు. ఆతనికి మరణ పరిమితత్వము ఆపాదితమాత్రమే అవుతుంది.

ఆతని పట్ల దేహముల రాకపోకలు - ‘‘వస్త్రధారణ, విసర్జన’’ వంటివిగా - దర్శితమగుచున్నాయి. వాయువు దేహము నందు బంధించినంత సమయము జీవుడు సంసార భ్రమలందుపడడు.

భ్రూమధ్య గల అంతరాకాశములో దృష్టిని నిలిపినంత కాలము ఇక ఆ యోగికి సంసార- దృశ్య సంబంధమైన భయమేముంటుంది? ఉండదు. ఈ దృశ్యమంతా ఆతనికి ‘‘ఎవరో కళాకారుడు నా వినోదముకై కల్పిస్తూ ఉన్నది’’ - అని అనిపించగలదు.

సృష్టికర్త అగు బ్రహ్మదేవుడంతటివాడు కూడా అల్పకాలభయములు (అవాంతర ప్రళయములు) కలుగు సందర్భములో. ప్రాణాయామపరుడై, ‘‘వేరుగా ఉండి, మౌనముగా చూస్తూ ఉండటము’’ - ను అభ్యసిస్తున్నాడు. అల్పకాలభయాత్ బ్రహ్మా, ప్రాణాయామ పరో భవేత్। కాబట్టి యోగులు, మునులు కూడా ప్రాణాయామపరులై ఉండటము ఆవస్యకము. అది ‘‘సాక్షీభావ యోగసిద్ధి’’ - ప్రసాదించగలదు.

- - -

  • హంస (రేచక రూపంగా) 24 అంగుళముల దూరము బహిర్గతంగా ప్రయాణము ఏస్తూ ఉంటోంది.
    వామ (ఇడ) - దక్షిణ (పింగళ) మార్గంగా రేచక - పూరక - కుంభక - పునఃరేచకరూపములగు ప్రాణాయామ ద్వయము యోగాభ్యాసముగా చెప్పబడుతోంది.

సామాన్యస్థితో నాడీ చక్రములో అనేక అపరిశుద్ధ పదార్ధములు (లోక వ్యావహారిక క్రియల కారణంగా - ఏర్పడే భావాభావములు) గూడు కట్టుకొని ఉంటున్నాయి. ఈ విధంగా అనేక మలములచే ‘మలాకులము’ అయినట్టి నాడీ చక్రము - ప్రాణాయామముచే పరిశుద్ధము అగుచూ ఉండగా, ఆ యోగి ప్రాణములను స్వకీయ శక్తిరూపముగా దర్శించు సామర్ధ్యమును పొందటము జరుగగలదు. ప్రాణశక్తితో ప్రకాశించుచూనే, జన్మ-కర్మల పట్ల ‘‘స్వాతంత్రుడు’’ అగుచున్నాడు.

ప్రాణాయామ ద్వయము

మొదట బద్ధ పద్మాసనము ధరించును గాక।
(1)
 చంద్రనాడీ - ఇడా కుంభకము - కుడి ముక్కు పుటమును కుడిచేతి బొటనవేలుతో బిగించి, ఎడమ ముక్కు పుటము ద్వారా గాలిని పూరకం చేసి, చంద్రనాడి (ఇడానాడి)లో పూరించి, యధాశక్తిగా కుంభకము చేసి.. ఆ తరువాత సూర్యనాడి ద్వారా వదలాలి (రేచకం చేయాలి). ఇది ‘ప్రాణాయామద్వయము’లో మొదటిది.
(2)
 సూర్యనాడీ - పింగళా కుంభకము - ఆ తరువాత పింగళనాడిలో పూరక - కుంభకము ఇడద్వారా రేచకము. ఇది ప్రాణాయామ ద్వయములో రెండవది.

ఈ విధంగా ‘‘ద్వివిధ ఇడా పింగళ నాడీ ప్రాణాయామము’’ చేస్తున్నప్పుడు - ధ్యానోపాయములు -

  • చంద్రనాడీ కుంభకము చేస్తున్న సమయములో ఆవుపాల రంగుతో సమానమైనట్టి చంద్రబింబమును ధ్యానించుటచే సుఖవంతుడు కాగలడు.
  • సూర్యనాడీ(పింగళనాడీ) కుంభకము ధారణ చేస్తూ ఉన్నప్పుడు ప్రకాశించుచున్న సూర్యమండలమును ధ్యానించుచూ ఉండటం చేత అట్టి ప్రాణాయామము సుఖవంతము కాగలదు.

ప్రాణంచేత్ ఇడయా పిబేత్ నియమితమ్। ప్రాణశక్తిని నియమితముగా ఇడానాడీ ద్వారా త్రాగి,
భూయో అన్యయా రేచయేత్ → పింగళనాడితో రేచకము చేయాలి (వదలాలి).
మరల పింగళనాడితో ప్రాణశక్తిని పీల్చి, ఇడనాడిలో రేచకము చేయాలి (వదలాలి).

ఈ విధంగా సూర్య-చంద్రమసముల బిందు ద్వయమును ధ్యానము చేయు యోగాభ్యాసి యొక్క నాడీ చక్రము 2 నెలలు దాటగానే దోషములన్నీ పోయి శుద్ధము కాగలదు.

ధారణ - ప్రదీపన - శోధనములు

ఈ విధంగా
(1) ఇష్టమనిపించినంత (కష్టము అనిపించనంత) సమయము వాయు ధారణము చేయటము,
(2) ప్రాణ - అపానముల సంయోగముచే జనించు అగ్నిని ప్రజ్వలింపజేయుటము (ప్రదీపనము).
(3) నాడీ శోధనము..

ఈ యోగాభ్యాసములచే నాదము అభివ్యక్తమగుచూ, శరీరమంతా ఆరోగ్యముగా ఉండగలదు.

 ప్రాణోయావత్ స్థితో దేహే అపానంతు నిరోధయేత్।। దేహములో ప్రాణము (లోపలికి వస్తున్న వాయు) స్థిరమై ఉన్నంత సేపు, అపానమును (బయటకు వెళ్లుచున్న వాయువును) నిరోధిస్తూ అపానమును వెనుకకు మరల్చి ప్రాణముతో పరస్పర ఏకస్థాన సంయోగము చేస్తూ ఉండాలి.

మాత్రా = ఒక శ్వాస (గాలి పీల్చి, వదలునంత సమయము) - ఏకశ్వాసమయీ ‘మాత్రా’  (1) ఒకసారి గాలి పీల్చి - వదలు సమయము  (2) చిటికవేయునంత కాలము.

రేచక -పూరక కుంభకములు - (1) వదలటము, (2) పీల్చి నింపటము (3) ధారణ చేయటము (4) పునఃవదలటము

ప్రణవాత్మకమైన = ప్రాణాయామము - ‘‘ఓం’’ అని ఉచ్ఛారణ చేస్తూ గాలిపీల్చి - కుంభించి - వదలటము.

    శ్లో।।  మాత్రా ద్వాదశ సంయుక్తౌ దివాకర - నిశాకరౌ 

        దోషజాలమ్ అబధ్నంతే జ్ఞాతవ్యౌ యోగిభిః సదా।।

 

(1) దివాకర (పింగళా పూరక కుంభక ఇడా రేచకము)      (2)  నిశాకర (ఇడా పూరక కుంభ పింగళా రేచకము)

ఈ ఉభయము 12 x 2 మాత్రల కాలముగా చేస్తూ ఉండగా దోషములన్నీ తొలగుతాయి. కాల నిర్ణయ యోగాభ్యాసమునకు ముందుగా ఈ ఈ ప్రణవాత్మకమై 12 మాత్రల ప్రాణాయామము చేయటమును యోగులు తెలుసుకొని అభ్యసిస్తూ ఉండాలి.

ఆ తరువాత దీర్ఘకాల ప్రాణాయామమునకు ఉపక్రమించవచ్చు.

యోగాభ్యాస ప్రాణాయామము ఈ క్రింది విధంగా శ్రద్ధగా అభ్యాసము చేయాలి.

పూరకము = 12 ‘ఓం’కారములు  (లేక మాత్రలు) 

కుంభకము = ‘16’ ఓంకారములు (లేక మాత్రలు) 

రేచకము = ‘10’ ఓంకారములు   (లేక మాత్రలు)

ప్రాణాయామములో - ‘కుంభక’ కాలము.

అధమ -     దిగువ తరగతి     - 12 మాత్రలు 

మధ్యమ -   మధ్య రకము   - 12 x 2 = 24 మాత్రలు 

ఉత్తమ -   ఉత్తమము   - 12 x 3 = 36 మాత్రలు

అని ప్రాణాయామ విధి గురించిన నిర్ణయము.

ప్రాణాయామములో ప్రారంభ - ఉత్తరోత్తర గుర్తులు :

అధమే - స్వేద (చమట) జననము <span style="color:green;">(Sweating)</span>. 

మధ్యమే - కంపన <span style="color:green;">(Shrivering)</span>. 

ఉత్తమమ్ - స్థానసిద్ధి.

తతో వాయుం నిరుంధయేత్ । ఈవిధంగా వాయువును నిరోధించటము చేయాలి.

 

ప్రాణాయామ విధి - విధానములు

మొట్టమొదట ‘పద్మాసనము’ ధరించాలి. (లేక సుఖాసనము అవధరించాలి).
గురుదేవులకు, సర్వాత్మకుడు, సర్వ శుభంకరుడు అగు శివ భగవానునికి నమస్కరించాలి. ప్రశాంతముగా కొన్ని క్షణములు గడపాలి.
ముక్కుకు పైభాగంగా (ఉపరిగా గల - ఆజ్ఞాచక్రాకాశములో) దృష్టిని నిలపాలి.
అప్పుడిక పైన చెప్పిన విధంగా ప్రాణాయామభ్యాసమును నిర్వర్తించాలి.
నవద్వారములలో (‘2’ కళ్లు, ‘2’ చెవులు, ముక్కు, గుదము, శిశ్నము, బ్రహ్మరంధ్రము)
 ‘‘వాయు కుంభకము’’ను భావిస్తూ ప్రాణాయామము నిర్వర్తిస్తూ ఉండాలి.
అపానమును ఊర్ధ్వమునకు లాగుచూ, అపాన వహ్ని సహితమైన శక్తితో కూడి కాలమును జయిస్తూ
 ‘‘కాలంఃకాలుడు, కాలనియామకుడు’’ - అగు కేవలాత్మ శివ భగవానుని ధ్యానించాలి.
క్రమంగా కుండలినీ శక్తిని చాలనం చేస్తూ సుషుమ్నా ప్రవేశము చేయించి, ఆజ్ఞాచక్రము వరకు నడిపించి, మూర్ధ్ని స్థానములో కుంభకమును అభ్యసిస్తూ ఉండాలి.

యావత్ తిష్ఠతి, తావత్ ఏవ మహతాం సంగో న సంస్తూయతే। ఎంతవరకు మూర్ధ్ని స్థానములో ప్రాణాయామ విధిగా యోగాభ్యాసి తిష్టించినవాడై ఉంటాడో అట్టిమహాత్మునకు ‘సంగము’ (Attachment) అనే దోషము ఉండదు. (ఆజ్ఞాచక్రము సమస్త ఇంద్రియములకు ఆవలగా ఉన్న యోగభావనాకాశము)

ఈ విధంగా ప్రాణాయామము..,
పాతక - ఇంధనేన పావకః। - ‘పాపములు’ అనే కట్టెలకు అగ్ని.
→ ‘భవము’ అనే (భవ) సాగరమునకు మహాసేతువు। భవోదధి మహాసేతుః।। (భవరోగము = ‘‘ఈ దృశ్యము నిజమే’’ - అను స్వతఃగా - ‘నాస్తి’ వస్తువుపై నమ్మకము, ‘అస్తి’ భావన).

  • ఆసనముచే (పద్మాసనము మొదలైనవాటిచే) రోగములు పోతాయి.
  • ప్రాణాయామముచే పాతకములు తొలగుతాయి.
  • ప్రత్యాహారముచే మనోవికారములు సమసిపోతాయి.
  • ధారణచే మనోధైర్యం రూపుదిద్దుకొంటుంది. అద్భుతమైన ఉత్సాహ-సాహస- ధైర్య - బుద్ధి-శక్తి -పరాక్రమ సమన్వితమైన చైతన్యము సముత్సాహమై ప్రకాశమానమౌతుంది.
  • సమాధిచే - శుభాశుభకర్మలన్నీ త్యజించబడగా మోక్షము కరతలామలకము కాగలదు.

‘‘జీవాత్మ నా యొక్క కల్పన. అద్దానికి ముక్తిని ఇవ్వవలసిన అవసరం లేదు. పరమాత్మగా నేను నిత్యముక్తుడను’’ - అను ధారణ అనునిత్యమౌతుంది.

 

ప్రాణాయామ - ప్రత్యాహార - ధారణ - ధ్యాన - సమాధులు

  • ప్రాణాయామ ద్విషట్కము (6x2 ప్రాణాయామములు)→ ‘ప్రత్యాహారము’ అగుచున్నది.
  • 12 ప్రత్యాహారములు → శుభప్రదమగు ‘ధారణ’ అగుచున్నది.
  • 12 ధారణలు → (ఒక) ధ్యానముతో సమానము.
  • 12 ధ్యానములు → ‘సమాధి’ అని అనబడుచున్నది.
  • శ్లో।। యత్ సమాధౌ పరంజ్యోతిః అనంతం విశ్వతోముఖమ్ 
  •     తస్మిన్ దృష్టే క్రియాకర్మ యాతాయాతో న విద్యతే।।

అట్టి ‘సమాధి’ యందు అనంతము, విశ్వతోముఖము అగు పరంజ్యోతి (పరమాత్మత్వము) సందర్శనమగుచున్నది. అట్టి ‘‘స్వస్వరూపాత్మ పరంజ్యోతి’’ సందర్శనముచే సమస్త క్రియాకర్మల యొక్క యాత - ఆయాతములన్నీ (కష్ట-సుఖభావములన్నీ) మొదలంట్లా తొలగిపోతాయి.

హృదయాకాశ స్వాభావిక కుంభక సిద్ధి

  • సుఖాసనమును అభ్యాసపూర్వంగా (సంబంధాసనము) ధరించి,
  • మేఢ్రమును (మూలాధార ఉపరిభాగమును) అంఘ్రియుగళము (పాదద్వయము)తో బంధించి, చెవులు - కళ్ళు- ముక్కు పుట ద్వారములను అంగుళులచే (వ్రేళ్ళచే) నియమించి కుంభకము ఆచరిస్తూ,
  • నోటితో వాయును పూరించి,
  • రొమ్ము వద్ద గాలిని కుంభించి,
  • బహు - అపాన సహితంగా క్రిందకు పోవు వాయువును పైకి లాగుచు) శిరస్సును ధారణ చేయటము.

ఈ విధంగా యోగసాధన చేయుచుండగా, ఆత్మతో ఆత్మగా తన్మయుడగుచూ, ఆ జీవుడు విశేషమైన ‘‘తత్త్వ సమత్వము’’ సిద్ధించుకొని యోగీశ్వరుడు’ కాగలడు.

నాద సిద్ధి :

వాయువు శిరో ఆకాశమును ప్రవేశించుచుండగా మహత్తరమైన ‘ధ్వని’ ఉత్పతన్నమగుచున్నది. అది గంట మొదలైనవి వాయించు ధ్వని వంటిది. అట్టి గంటానాదము వినబడటము ‘నాదసిద్ధి’ అని అనబడుచున్నది.

 

ప్రాణాయామ ప్రయోజనములు

ప్రాణాయామ అభ్యాసముచే సర్వరోగములు క్షయించగలవు. ప్రాణాయామాభ్యాసము ఆశ్రయించకపోతే సర్వరోగములకు చోటు ఇస్తున్నట్లే అవుతుంది.

ఎక్కిళ్ళు, గొంతు గరగర, శ్వాస సమస్యలు, తలపోటు, పార్శ్వంనొప్పి, చెవి పోటు మొదలైన అనేక శారీరక వ్యాధులన్నీ వాయు వ్యత్యాసము వల్లనే (శరీరములో వాయు ప్రసరణ ఆయా ప్రదేశములలో అధికంగానో, అల్పంగానో జరుగుటచేతనే) ఏర్పడుచున్నాయి.

ప్రాణాయామ యోగాభ్యాసముచే వాయువు దేహమంతా సమత్వము పొందినదై, అనేక వ్యాధులు దరిజేరకుండా చేయగలదు.

సింహము, ఏనుగు, పులి, పాము మొదలైన జంతువులను తెలివిగా, మెల్లగా, విధి విధానంగా ప్రయత్నిస్తే అవి మానవునికి వశమౌతున్నాయి. ఉపాయము తెలియకపోతేనో? అవి మానవునికి హాని కలుగజేస్తాయి. అదేవిధంగా, విధి -విధానములతో కూడిన ప్రయత్నముచే దేహములో సంచరించే పంచప్రాణములు ఈ జీవునికి వశమై సమస్త శుభములు కలుగజేస్తాయి. ఉపాయముతో కూడిన అభ్యాసము లేకపోతేనో? ఆ పంచప్రాణములే తమ యొక్క అపసర్గసంచారములచే దేహములో అనేక వ్యాధులు జనించటానికి కారణము కాగలవు.

ఈ విధంగా ప్రాణ చలనముతో స్నేహమే ‘ప్రాణాయామము’ యొక్క ఉద్దేశ్యము. అది క్రమంగా ‘ప్రాణ-ఈశ్వరత్వము’ ప్రసాదించగలదు.

యుక్తం యుక్తం - రేచకమ్ - పూరకము - కుంభకమ్

యోగాభ్యాసములో యుక్తియుక్తము (ఉపాయము, తెలివి) కలిగి ఉండాలి.

  • యుక్తం యుక్తంగా త్యజేత్ వాయుః । యుక్త యుక్తంగా మెల్లమెల్లగా వాయువును వదలుచూ ఉండాలి. యోగవేత్తలు చెప్పే విధంగా రేచకము చేయాలి. కొంచము కొంచముగా ప్రారంభించి, వృద్ధి చేసుకోవాలి. సాధ్యమైనదే సాధన.
  • యుక్తం యుక్తం ప్రపూరయేత్ । యుక్తయుక్తంగా ప్రపూరించాలి. పూరకము నిర్వర్తించాలి.
  • యుక్తం యుక్తం ప్రబధ్నీయాత్ । యుక్తం యుక్తంగా ప్రపూరణము (వాయు కుంభకము) నిర్వర్తించాలి.

అప్పుడు తప్పక యోగసిద్ధి లభించగలదు. అంతేగాని హఠించి శరీరమును బాధించుకోవటము కూడదు.

ప్రత్యాహార - మహత్ భవమ్।

ప్రత్యాహారము : చరతాం చక్షురాదీనాం విషయేషు యథా క్రమమ్, తత్ ప్రత్యాహరణం తేషామ్, ‘‘ప్రత్యాహారః’’ స ఉచ్యతే। ఈ కళ్లు మొదలైన ఇంద్రియములు ఎల్లప్పుడు అవిశ్రాంతంగా లౌకిక విషయాలవైపుగా ఆకర్షణ పొందినవై విశ్రాంతి - శాంతి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాయి. అట్టి పంచేంద్రియములను దృశ్య వ్యవహారముల నుండి (ధ్యాస యుక్తంగా) వెనుకకు మరల్చి, ఆత్మతత్త్వజ్ఞానమార్గములో నియమించటమే ‘‘ప్రత్యాహారము’’ అని పిలువబడుచున్నది. ఏ విధంగా అయితే సాయంకాలం అయ్యేసరికి సూర్యకిరణాలు జగత్ పదార్ధముల నుండి వెనుకకు మరలి, తిరిగి సూర్యగోళంలో యధాస్థానము పొందుచున్నాయో...,

అదేవిధంగా →

(ద్వంద్వమును అధిగమించినప్పటి) తృతీయకాలంలో ప్రత్యాహార - అభ్యాస ప్రభావం చేత మనస్సు విషయముల నుండి విరామము పొంది, సర్వ వికారములను త్యజించి, స్వస్థానమగు ఆత్మయందు ప్రవేశించి రమించగలదు.

అట్టి ఆత్మత్వము ఈ జీవునియొక్క స్వాభావిక సత్యమే అయి ఉన్నది. అద్దాని అవ్యాజ, అనునిత్య, అచ్యుత, నిశ్చలానుభవమే ‘‘యోగము’’ యొక్క పరమ - పరమ లక్ష్యము.

ఆత్మౌపమ్యేవ సర్వత్ర సమం పస్యతి।।

ఇతి యోగచూడామణి ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।

Source : YH Ramakrishna Sir 

Friday, January 24, 2025

దేవుడనే వాడు ఉన్నాడా? ( good conversation : faith on God telugu)

 దేవుడనే వాడు ఉన్నాడా?

 


ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి  ఒక జర్నలిస్ట్ వెళ్ళింది. ఏదైనా గొప్ప ఆర్టికల్ ప్రచురించి మంచిపేరు తెచ్చుకోవాలని ఆమె కోరిక. అక్కడే ఉన్న ఒక వృద్ధ పూజారిని ఇలా అడిగింది.

 

జర్నలిస్ట్ : మీ వయసు ఎంతుంటుందండి?

పూజారి : 85 ఏళ్లు ఉంటాయండి 

జర్నలిస్ట్ : ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?

పూజారి : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి... ఎందుకమ్మా అలాడుగుతున్నావు.!?

జర్నలిస్ట్ : ఏమిలేదు స్వామీ... మీరు ఇన్ని సంవత్సరాల నుండి దేవుణ్ని పూజిస్తూ, ప్రార్దిస్తున్నారు కదా.!. మరి మీరు ఎప్పుడైనా దేవున్ని చూసారా.!? 

పూజారి : లేదండి.!!

జర్నలిస్ట్ : మరి అలాంటప్పుడు ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళ్ళుతున్నారు.!!?

పూజారి : మీరెక్కడ నుండి వచ్చారు?*

జర్నలిస్ట్ : సిటీ నుండి.,

పూజారి : అక్కడ ఎక్కువ మంది రకరకాల కుక్కల్ని పెంచుకొంటారట కదా.!? 

జర్నలిస్ట్ : అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు.

పూజారి : మాది  చిన్న పల్లెటూరండి, అక్కడ పంటచేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు.

జర్నలిస్ట్ : నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం.!? 

పూజారి : నీ ప్రశ్నకు సమాధానం వుందమ్మ చెపుతా... విను,         రాతిళ్ళు పంటచేల్ల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టు ప్రక్కల దూరంగా  ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతోనే  మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు కదా.! 

 

అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతో మంది, ఋషులు, పుణ్య పురుషులు, మహాత్ములు, వాళ్ళ తపస్సుతో దేవుడిని చూసి వచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మంలో దేవుడు ఉన్నాడని ఎంతో మంది గొప్ప... గొప్పవారు చెప్పారు కదా.!

 

 అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే  ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరగగా లేనిది, ఆలోచించే శక్తి ఉన్న మనుషులం మనం మన పూర్వీకులనే నమ్మలేమా.!

 

కనుక తప్పకుండా మంచి మనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకోగలను... అనే నమ్మకం నాకు ఉంది  అమ్మా.!!

 

జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత లేదు నా వయస్సు , ఏదైనా తప్పుగా  మాట్లాడి వుంటే నన్ను క్షమించండి ,జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను. అంటూ అతనికి నమస్కరించి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళి పోయింది

 

Tuesday, January 14, 2025

నూట ఎనిమిది (108) విశిష్టత - Special of 108 in telugu


నూట ఎనిమిది (108) విశిష్టత


 ఈ వ్యాసం జ్యోతిష్ డైజెస్ట్ , వాల్యూం 4 ఇష్యూ 2, న్యూఢిల్లీ, 2005 ద్వారా ప్రచురించబడింది మరియు కాపీరైట్ చేయబడింది. ఈ వ్యాసం యొక్క ప్రధాన భాగంలో ఉదహరింపబడని సమాచారం శ్రీ అచ్యుత దాస్ ఆఫ్ ఒరిస్సా యొక్క పరంపర నుండి వచ్చింది.

రాశిచక్రంలో ఒక్కొక్కటి 30 డిగ్రీల 12 రాశి (సూర్య రాశులు) ఉన్నాయి. ఈ రాశి ఆదిత్యులతో (12 సూర్య దేవతలు) అనుసంధానించబడి ఉంది మరియు రాశి సూర్యుని ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది. సూర్యుడు 1వ మరియు గృహాలు 9వ గృహాలకు కారక (సూచనకారకుడు). మీరు ప్రతి రాశిని తీసుకొని దానిని తొమ్మిది అంశలుగా (విభాగాలు) విభజించినప్పుడు అది నవాంశ (9వ డివిజనల్ చార్ట్) సృష్టిస్తుంది. 30 డిగ్రీలను తొమ్మిదితో భాగిస్తే 3 డిగ్రీలు మరియు 20 నిమిషాల 9 సంకేతాలు వస్తాయి. 9 అంశలను కలిగి ఉన్న 12 రాశులలో ప్రతిదానితో 108 అంశలు ఉన్నాయి. ఈ నవాంశ ఆత్మ యొక్క స్వాభావిక గుణాలు, స్థానిక ధర్మం (ప్రయోజనం), భాగ్యం (అదృష్టం) మరియు ఒకరి జీవిత భాగస్వామిని చూపుతుంది. నవాంశ అనేది వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత గౌరవనీయమైన 108 సంకేత పటం మరియు ఒక వేద జ్యోతిష్కుడు దాని ప్రక్కన కూర్చున్న నవాంశ లేకుండా జన్మ చార్ట్ చదవడు.

చంద్రుడు సుమారు 27 రోజులలో రాశిచక్రం గుండా వెళతాడు, ఇది నక్షత్రాలు అని పిలువబడే చంద్ర రాశిచక్రాన్ని సృష్టిస్తుంది. 4వ ఇంటికి చంద్రుడు కారక (సూచిక) ఉన్నాడు. ఈ 27 చంద్ర రాశులలో ప్రతి ఒక్కటి పాదాలు (పాదాలు/పాదాలు) అని పిలువబడే 4 అంసాలుగా (విభాగాలు) విభజించబడ్డాయి. నక్షత్రాలు (చంద్ర రాశులు) 13-20 డిగ్రీలు మరియు నాలుగుతో భాగిస్తే 3-20 డిగ్రీలు అవుతాయి. 27 నక్షత్రాలను 4 పాదాలతో గుణిస్తే 108. నాలుగు పాదాలు నాలుగు అయనాలకు సంబంధించినవి: కర్మ (వృత్తి), అర్థ (జీవనము), కామ (ఆనందం/కుటుంబం), మోక్షం (ఆధ్యాత్మికత/విముక్తి). ప్రతి పాదానికి ఒక టోన్ ఉంటుంది, దాన్ని ఉపయోగించి టోన్‌లో ఒక గ్రహాన్ని యాక్టివేట్ చేయవచ్చు. చంద్రునికి 108 పాదాలు మరియు 108 స్వరాలు ఉన్నాయి.

3-20 డివిజన్ అత్యంత కీలకమైన విభజనగా వెల్లడించింది. చంద్రుని యొక్క పాదాలు మరియు సూర్యుని యొక్క నవాంశాలు 108 సంఖ్యతో వరుసలో ఉంటాయి. 108 అనేది చంద్రుడు (మనస్) మరియు సూర్యుడు (ఆత్మన్/అహంకర్) వరుసలో ఉండే సంఖ్య. ఇక్కడ చంద్రుని చక్రం సూర్యుని చక్రంతో సమలేఖనం చేయబడుతుంది. 108 అనేది మనస్సు మరియు ఆత్మను సమలేఖనం చేసే సంఖ్య.

3-20 డివిజన్ సూర్యుడు మరియు చంద్రులను సమలేఖనం చేస్తుంది, ఇది శివుడు మరియు పార్వతి లేదా పురుష మరియు ప్రకృతి యొక్క అమరికను కూడా చూపుతుంది. 108 విభజన అనేది పురుష మరియు ప్రకృతి కలయిక, ఇది ప్రపంచ సృష్టి.

సూర్యుడు మరియు చంద్రుడు వాటి స్వంత వ్యాసాల కంటే దాదాపు 108 రెట్లు భూమికి అనుసంధానించబడి ఉన్నాయి. మీరు భూమి నుండి సూర్యుడు మరియు చంద్రుడిని చూసినప్పుడు అవి ఒకే పరిమాణంగా గుర్తించబడతాయి, అదే పరిమాణం వాటి దూరం కారణంగా కనిపిస్తుంది. రాశిచక్రంలో పెద్ద సౌర గుర్తులు (రాశిలు) 108 సంఖ్యతో చిన్న చంద్ర గుర్తులు (నక్షత్రాలు) అదే పరిమాణాన్ని కనుగొంటాయి. సూర్యుడు (1,392,000 కిమీ ) చంద్రుడి కంటే (3,474.8 కిమీ) 400 రెట్లు చిన్నదైనప్పటికీ, అవి గ్రహించబడతాయి. వారి స్వంత వ్యాసం 108 రెట్లు విభజన ద్వారా అదే. పురుషుడు (సూర్యుడు) మరియు ప్రకృతి (చంద్రుడు) 108 యొక్క కంపనాన్ని ఈ భూమిపై ఉన్నట్లుగా సృష్టించడానికి మరియు నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారని ఇది భౌతికంగా వెల్లడిస్తుంది. ఈ దూరం కారణంగా 108 పవిత్రమైనది కాదు, ఈ దూరం (108 ల్యుమినరీస్ స్వంత వ్యాసం) ఉనికిలో ఉంది, ఎందుకంటే ఇది మనకు తెలిసిన అన్ని జీవులు ఉనికిలోకి తీసుకురాబడిన కంపనం.

పురుష మరియు ప్రకృతి యొక్క కంపనమే మనలను ఉనికిలోకి తెచ్చింది మరియు ఇది మన ఉనికిలో మేల్కొలపడానికి, మన ఉనికిని మార్చడానికి లేదా మన ఉనికిని అధిగమించడానికి అనుమతించే రహస్య కీ. ఇది ఏదైనా చేయగల శక్తివంతమైన శక్తి, తంత్రం (పాజిటివ్ మరియు నెగటివ్ రెండూ) ఈ శక్తిలోకి ప్రవేశిస్తుంది. దేవుడు మరియు దేవత, పురుష మరియు ప్రకృతి యొక్క అత్యున్నత సృజనాత్మక శక్తి యొక్క ఈ కంపనాన్ని తాకడానికి ఒక మాలాపై 108 పూసలు ఉన్నాయి.

పురుష (సూర్యుడు) మరియు ప్రకృతి (చంద్రుడు) నుండి 108 యొక్క అన్ని ఇతర జాబితాలు విప్పుతాయి. ఉదాహరణకు, ఆయుర్వేదంలో శరీరంలో 108 మర్మాలు ఉన్నాయి. అవి జీవిని నయం చేయగల లేదా చంపగల పాయింట్లు. అవి చైతన్యం శరీరానికి అనుసంధానించే పాయింట్లుగా పరిగణించబడతాయి, ఇక్కడ జీవులకు ప్రాణం పోయడానికి పురుష (స్పృహ) ప్రకృతి (శరీరం) లోకి తీసుకురాబడుతుంది (మనుషులు మరియు జంతువులకు ఈ పాయింట్లు ఉన్నాయి). శ్రీ చక్రంలోని 108 ఖండనలు మళ్లీ ఈ సంఖ్యల సామర్థ్యానికి సంబంధించినవి పురుష మరియు ప్రకృతి యొక్క సమతుల్యతను మరియు రెండింటినీ స్పష్టంగా చూడగల ఋషి యొక్క ఆదిమ సామర్థ్యానికి సంబంధించినవి.

రేఖీయ సమయంలో ప్రకృతి (వ్యక్తమైన సృష్టి) పురుషుడి నుండి వచ్చింది (సృష్టించబడినదానికి మించిన సంపూర్ణమైనది). ఇది అన్నింటికీ వచ్చిన ఒక పాయింట్. నాన్-లీనియర్ సమయంలో, 'ఏమీ లేదు' మరియు 'ఏదో' పదాలకు మించి కనెక్ట్ అయ్యే చోట ఈ పాయింట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ స్థలం 108.

అదనపు పాయింట్లు

108కి అనుసంధానించబడిన గ్రహాల మధ్య దూరం గురించి నేను కొన్ని సార్లు చదివాను మరియు నేను దానిని ప్రశ్నించాను మరియు ఈ సంఖ్యలు ఎక్కడ నుండి వస్తున్నాయో మరియు అవి ఎంత ఖచ్చితమైనవో తెలుసుకోవడానికి ఒక చిన్న పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను.

ఇక్కడ చేసిన ప్రకటన:
1- భూమి మరియు సూర్యుని మధ్య దూరం = 108 రెట్లు సూర్య-వ్యాసం,
2- భూమి మరియు చంద్రుని మధ్య దూరం = 108 సార్లు చంద్ర-వ్యాసం,
3- సూర్యుని వ్యాసం = భూమి వ్యాసం కంటే 108 రెట్లు.

నా పరిశోధన:

1 . భూమి మరియు సూర్యుని మధ్య దూరం = 108 రెట్లు సూర్య-వ్యాసం

సూర్యుని వ్యాసాన్ని శాస్త్రవేత్తలు కొలవడం అంత సులభం కాదు. ఇవి నేను కనుగొనగలిగిన సంఖ్యలు.
-1,392,000 కిమీ
 (“సన్” కొలంబియా ఎలక్ట్రానిక్ ఎన్‌సైక్లోపీడియా . 6వ ఎడిషన్. కొలంబియా యూనివర్సిటీ ప్రెస్, 2003) 
1,400,000 కిమీ
 (నమోవిట్జ్, శామ్యూల్ ఎన్. మరియు స్పాల్డింగ్, నాన్సీ ఇ. ఎర్త్ సైన్స్ . ఇవాన్‌స్టన్, కంపెనీ 9,
1,390,000 కి.మీ
 (ది అమేజింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA), 2003)
– 1,380,000 కిమీ
 (నమోవిట్జ్, శామ్యూల్ ఎన్., మరియు నాన్సీ ఇ. స్పాల్డింగ్. హీత్ ఎర్త్ సైన్స్ . లెక్సింగ్టన్, 3 MA:89 .)

భూమి మరియు సూర్యుని మధ్య దూరాన్ని జ్యోతిష్య యూనిట్ (AU) అంటారు.
1 AU = 149,597,870.691 కిలోమీటర్లు
ఇది ఇవ్వబడిన సంఖ్య అయినప్పటికీ, సంఖ్యలలోకి వైవిధ్యం వచ్చే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఒక మార్గం సూర్యుని చుట్టూ భూమి యొక్క దీర్ఘవృత్తాకార కక్ష్య.
పెరిహెలియన్
 : 147.5 మిలియన్ కిమీ, దాదాపు జనవరి 4వ తేదీ
 ఫెలియన్ 152.6 మిలియన్ కిమీ, జూలై 4 (http://science.nasa.gov నుండి)

అన్వేషణలు:
భూమి మరియు సూర్యుని మధ్య సగటు దూరాన్ని తీసుకొని (149,597,870.691 కిమీ) మరియు సూర్యుని యొక్క అత్యంత సాధారణంగా ఉపయోగించే వ్యాసం (1,392,000 కిమీ)తో భాగిస్తే ఫలితం 107.46973469181034482758620689655.

2. భూమి మరియు చంద్రుని మధ్య దూరం = 108 సార్లు చంద్రుడు-వ్యాసం

చంద్రుని వ్యాసం: 3,474.8 కి.మీ
(http://en
 . w i kipedia.org/wiki/Earth)

భూమి నుండి చంద్రునికి దూరం:
మళ్లీ చంద్రుని భ్రమణం దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది మరియు ఖచ్చితమైన వృత్తం కాదు. కానీ అపోలో 11 వ్యోమగాములు చంద్రునిపై అద్దాలను ఉంచారు మరియు లేజర్‌లు కాంతి ప్రతిబింబించడానికి పట్టే సమయాన్ని కొలుస్తాయి, ఇది ఏ సమయంలోనైనా కొన్ని అంగుళాల వరకు ఖచ్చితత్వంతో కొలతలను ఇస్తుంది.
పెరిగ్రీ 363,300 కిమీ
అపోజీ 405,500 కిమీ
సగటు దూరం 384,400 కిమీ
 (http://www.freemars.org/jeff/planets/Luna/Luna.htm)

అన్వేషణలు:
చంద్రుని నుండి భూమికి (384,400 కి.మీ) మధ్యస్థ దూరాన్ని తీసుకొని దానిని చంద్రుని వ్యాసం (3,474.8 కి.మీ)తో భాగిస్తే 110.62507194658685391965005180154 వస్తుంది.

3. సూర్యుని వ్యాసం = భూమి వ్యాసం కంటే 108 రెట్లు

భూమి యొక్క వ్యాసం:
భూమధ్యరేఖ వ్యాసం 12,756.28 కిమీ
ధ్రువ వ్యాసం 12,713.56 కిమీ
సగటు వ్యాసం 12,742.02 కిమీ (http://en.wikipedia.org/wiki/Earth)

గమనిక: భగవద్ పురాణ కాంటో 5, శ్లోకం 2 ఇలా చెబుతోంది “ఉష్ణానికి మూలమైన సూర్యగోళం 10,000 యోజనాల వెడల్పు (విస్తారతః) కలిగి ఉంది. చంద్రుని వెడల్పు 20,000 యోజనాలు”
సూర్యుడు 10,000 యోజనాలు = 72,000 కిమీ, వాస్తవ వ్యాసం 1,392,000 కిమీ
చంద్రుడు 20,000 యోజనాలు = 144,000 కిమీ, వాస్తవ వ్యాసం 3,474.8 కిమీ.

గ్రహణం సరైనది కానప్పటికీ, గ్రహణం సరైనది కానప్పటికీ, ప్రాథమిక సమాచారం సరైనది కాదు. 7వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు భూమిని 5,000 యోజనాలుగా గణించాడు, అంటే 36,000 కి.మీ (ఒక యోజనకు @7.2కి.మీ). ఇది దగ్గరగా ఉంది; భూమధ్యరేఖ వద్ద వాస్తవ చుట్టుకొలత 40,076 కి.మీ.

అన్వేషణలు:
భూమి యొక్క సగటు వ్యాసంతో (12,742.02 కిమీ) భాగించబడిన సూర్యుని (1,392,000 కి.మీ) వ్యాసాన్ని ఎక్కువగా ఉపయోగించినట్లయితే 109.24484500887614365697118667213 వస్తుంది.

తీర్మానం:
ఈ కొలతలలో 108 సంఖ్యకు సాపేక్ష సామీప్యాన్ని చూడటం ఆనందంగా ఉంది, కానీ శాస్త్రీయ పరిశీలనలో సంఖ్యలు చాలా ఎక్కువగా నిలబడలేవు. అటువంటి గణనల నుండి 108 సంఖ్యను పవిత్రమైనదిగా ఎవరూ వెనక్కి తిరిగి చూడరు. ఈ వాస్తవ సమాచారాన్ని పేర్కొనడం కూడా 108 గురించి లోతైన అవగాహనను ఇవ్వదు.

జ్యోతిష్ సంప్రదాయంలో, 108 సూర్యుడు మరియు చంద్ర చక్రాలకు సంబంధించిన వివిధ గణనలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ ఆధునిక ఖగోళ దూరాలు సంవత్సరం పొడవు మరియు సైడ్రియల్ చంద్ర చక్రం పొడవుతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి/సృష్టిస్తాయి (సమయ నిడివి దూరం/చలనం ద్వారా సృష్టించబడుతుంది). ప్రాచీనులకు ఆధునిక దూరాలు తెలియకపోయినా, నిష్పత్తులు కాలచక్రాల గణితంలో తమను తాము వెల్లడిస్తాయి, ఇక్కడ 365.256 రోజుల సంవత్సరం సగటు 360 (12 X 30) మరియు 27.321661 నెల సగటు 27. ఈ సంబంధం కలిగి ఉంటుంది. సోలి-చాంద్రమాన క్యాలెండర్‌ను లెక్కించే వ్యక్తులచే గ్రహించబడింది, దీనిని పురాతన ప్రపంచంలోని మెజారిటీ ఉపయోగించారు (సుమేరియా నుండి చైనా వరకు మరియు తరువాత గ్రీస్‌లో). 

108 యొక్క అన్ని ఇతర ఉపయోగాలు (పవిత్ర స్థలాలు, పవిత్ర పేర్లు మొదలైనవి) 108 యొక్క గొప్ప అర్థాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఉత్పన్నమయ్యేవి.


అదనపు పాయింట్లు

1 + 0 + 8 = 9. తొమ్మిది అనేది పూర్తి చేసిన సంఖ్య. సున్నా మొదటి సంఖ్య మరియు 9 తర్వాత సంఖ్యలు తమను తాము పునరావృతం చేయడం ప్రారంభిస్తాయి. 9 గణనీయమైన సంఖ్యలు మానవ ఉనికి యొక్క 9 ఆర్కిటైప్‌లను సూచిస్తున్నాయి (నవగ్రహం). తొమ్మిది కొన్నిసార్లు కేతువుతో అనుసంధానించబడి ఉంటుంది, మోక్ష కారక (విముక్తికి సంకేతం), అధిక అవగాహన, విస్తరించిన దృష్టి మరియు మోక్షం (విముక్తి) తెచ్చే గ్రహం. కేతువు మనకు మోక్షాన్ని ఇచ్చే తల్లి కుండలిని తలుపును కాపాడే దేవత గణేష్‌తో అనుసంధానించబడి ఉంది.

దుర్గా సప్తసతిలో, దుర్గాదేవికి నవదుర్గ అని పిలువబడే తొమ్మిది రూపాలు ఉన్నాయి. సంఖ్య 9 దుర్గా దేవతతో అనుసంధానించబడింది, దీని యంత్రం (జ్యామితీయ చిహ్నం) 9 కోణాల నక్షత్రాన్ని కలిగి ఉంటుంది మరియు నవరాత్రి (దేవత తొమ్మిది రాత్రులు) నాడు జరుపుకుంటారు. హిందూ కాలచక్ర జ్యోతిషశాస్త్రంలో శరీరం యొక్క ప్రాణాన్ని కాపాడేది దుర్గ, ఆమె మన ప్రధాన శక్తిని కాపాడుతుంది.

1 + 0 + 8 = 9. సంఖ్యాపరంగా, తొమ్మిది అనేది చాలా ప్రత్యేకమైన సంఖ్య, ఇది ఎల్లప్పుడూ దానికే తిరిగి వస్తుంది. ఇతర సంఖ్యలతో ఇది ఎలా ప్రవర్తిస్తుందో చూడండి:
9 x 1 = 9
9 x 2 = 18, 1 + 8 = 9
9 x 3 = 27, 2 + 7 = 9
9 x 4 = 36, 3 + 6 = 9
9 x 5 = 45, 4 + 5 = 9
9 x 6 = 54, 5 + 4 = 9
9 x 7 = 63, 6 + 3 = 9
9 x 8 = 72, 7 + 2 = 9
9 x 9 = 81, 8 + 1 = 9
9 x 10=90, 9 + 0 = 9
9 x 11 = 99, 9 + 9 = 18, 1 + 8 = 9
9 x 12 = 108

శరీరంలో 108 మర్మాలు, జంక్షన్ పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ స్పృహ మాంసంతో ముడిపడి ఉంటుంది. మనం 108 మంత్రాలు చెప్పినప్పుడు అది ప్రతి బిందువుకు కవచ్ (రక్షణ) వలె పనిచేస్తుంది.

హృదయ (హృదయ కేంద్రం) నుండి 108 చువ్వలు శరీరానికి శక్తినిస్తాయి. మరియు మనం మన మంత్రాలను 108 సార్లు చేసినప్పుడు, ఈ ప్రతి ఛానెల్‌లో (అలాగే ఒక గ్రహం ఉంచబడే 108 నవాంశాలలో ప్రతి ఒక్కటి) మంత్రం ప్రవహిస్తుంది.

ఆదిలో క్షీరసాగర మథనం జరిగినప్పుడు, అది దేవతలు (దేవతలు) మరియు అసురులు (రాక్షసులు) యొక్క పని ఐక్యతతో మాత్రమే సాధ్యమైంది. వారు పాల సముద్రాన్ని (పాలపుంత) మథనం చేయడానికి ఒక గొప్ప పామును ఉపయోగించారు, తోక వైపు 54 దేవతలు మరియు తలల వైపు 54 అసురులు ఉన్నారు. వారు అమృతం (అమరత్వం యొక్క అమృతం) కోసం వెతుకుతూ సముద్రాన్ని మథనం చేశారు. సముద్రం నుండి ఉద్భవించే ముందు అనేక విషాలు మరియు దీవెనలు ఉద్భవించాయి. ఇవి మనలోని 54 ప్రతికూల లక్షణాలను సూచిస్తాయి, అవి లోపల ఉన్న అమృతం కోసం వెతుకుతున్న ఆధ్యాత్మిక పనిలో 54 సానుకూల లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మథనం మన వెన్నెముక యొక్క పర్వత అక్షంపై కుండలిని దిగువ మూల చక్రం యొక్క తాబేలుతో పైకి లేపడానికి అనుమతిస్తుంది.

108 నవాంశాలు/పాదాలు శాశ్వతంగా రాశిచక్రంలోకి చేర్చబడ్డాయి. సూర్యుడు ఏడాది పొడవునా వీటిని దాటుతూ ఉంటాడు. 54 రాక్షసులు సూర్యుని దక్షిణ మార్గము (దక్షిణ అయన) ఉత్తర అర్ధగోళంలో ఎక్కువ చీకటి ఉంటుంది. 54 దేవతలు సూర్యుని ఉత్తర గమనం (ఉత్తర అయన). ఇది దేవతల కాలం, ఇక్కడ కాంతి ఎక్కువగా ఉంటుంది.

నమః శివాయ

 

Tuesday, January 7, 2025

సప్తఋషి ధ్యాన శ్లోకములు :( SaptaRishi Dhyanam telugu)

 




సప్తఋషి ధ్యాన శ్లోకములు :

కశ్యప ఋషి :

కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||

అత్రి ఋషి :

అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్|| ఓం అనసూయా సహిత అత్రయేనమః||

భరద్వాజ ఋషి :

జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్|| ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||

విశ్వామిత్ర ఋషి :

కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్|| ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||

గౌతమ ఋషి :

యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః|| ఓం అహల్యా సహిత గౌతమాయనమః||

జమదగ్ని ఋషి :

అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే|| ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వసిష్ఠ ఋషి :

శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా|| ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా|| సప్తఋషిభ్యో నమః

Monday, January 6, 2025

విభూతి

 1. విభూతి అంటే ఏమిటి?

విభూతి అంటే విశేషమైనది అని అర్థం. హోమ ద్రవ్యాలైన దర్భలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయ , మోదుగ, రావి, తులసి మొదలైన కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకలు, నవధాన్యాలు నెయ్యి మొదలైనవి వేసి హోమం చేయగా చివరకు మిగిలిన బూడిదను విభూతి అంటారు. అగ్నికి దహించే గుణం ఉంటుంది. హోమద్రవ్యాలైన కొబ్బరికాయ, కట్టెలు, పిడకలు, నవధాన్యాలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంటుంది. ఈ రెండింటి కలయికవల్ల ఏర్పడిన విభూతి, దహించడం, దహింపబడటం అనే రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. పరమ శివ భక్తులు విభూతిని తప్పక ధరిస్తారు.
2. విభూతి ని ఎలా ధరించాలి?
శ్రీకారం చ పవిత్రం చ శోక రోగ నివారణం
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రైలోక్య పావనం

ఈ శ్లోకాన్ని పఠిస్తూ విభూతిని ధరించాలి.

కుడిచేతి మధ్యవేలు మరియు ఉంగరపు వేళ్ళ సాయంతో విభూతిని ధరించాలి. నుదుటిపై విభూతిని ధరించేటప్పుడు ఎడమవైపు నుండి కుడివైపుకు రేఖలను దిద్దాలి. అప్పుడు బొటనవేలితో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు.
3. విభూతిని ఎప్పుడు ధరించాలి?
విభూతిధారణ శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, నిత్య పూజ చేసే సమయం లో, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేటప్పుడు, హోమాలు చేసే సమయం లోనూ ధరించడం వల్ల అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. విభూతి కానీ తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించరాదు.
4. విభూతిని ధరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
విభూతి నేలపై పడకూడదు. ఒకవేళ పడితే, వస్త్రంతో తీయాలి కానీ, చీపురు తో ఊడ్చరాడు. పురుషులు విభూతిని స్త్రీల చేతికి ఇవ్వరాదు. పురుషులు, సుమంగళులైన స్త్రీలు విభూతిని తడిపి పెట్టుకోవాలి. పూర్వ సువాసినులు పొడి విభూతిని ధరించాలి. విభూతిని మధ్య వేలు లేదా ఉంగరము వేలుతో పెట్టుకోవాలి . చూపుడు వేలుతో పెట్టుకోరాదు.
5. విభూతి ఎన్ని రకాలు?
విభూతి ఐదు రకాలు

1. భస్మం – శ్వేత వర్ణము

2. విభూతి – కపిలవర్ణము,

3. భసితము -కృష్ణవర్ణము

4. క్షారము – ఆకాశవర్ణము

5. రక్షయని – రక్తవర్ణము

కాపాలికులు, అఘోరాలు ధరించేది చితాభస్మం. గృహస్థులు యోగులు ధరించేది హోమ భస్మం అనగా విభూతి.
6. విభూతి ధరించడం వల్ల కలిగే శుభాలు
విభూతి స్నానం సర్వ పుణ్యనదులలో చేసిన స్నానం తో సమానం.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:

శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.
శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.
శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.
శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.
శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి
శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం,
శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.
శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.
హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.
7. శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన విభూతి యోగం..!
‘వి’ అనే ఉపసర్గకు వివిధమైన అనే అర్థం. ‘భూ’ అంటే ఉండటం. విభూతి అంటే పరమాత్మ తత్త్వం వివిధ రూపాల్లో ప్రకటితం కావడం. భగవద్గీత లోని పదవ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు పరమాత్మ తత్వమైన విభూతుల గురించి వివరిస్తాడు. ఆ అధ్యాయాన్ని విభూతి యోగం అంటారు. దండించేవారి దండనీతి,జయించేవారి రాజనీతి,రహస్యాలలో మౌనం,జ్ఞానులలో జ్ఞానం నేనే.సర్వభూతాలకు బీజకారణం నేనే. నేను కానిది ఏదీ లేదు.నా విభూతులు(రూపాలు) అనంతం. ఐశ్వర్యంతోను, కాంతితోను, ఉత్సాహంతోను కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశలని తెలుసుకో. ఇన్ని మాటలు దేనికి? నా తేజస్సులోని ఒకేఒక్క కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదని గ్రహించు. (10-41). అని చెబుతాడు

కర్పూర కథ :

 కర్పూర కథ :


కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.

ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.

పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.

హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.

రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.

కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:

1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
10 మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
11.రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
12.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
15. తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
16. పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
17. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
18. అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
19. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
20. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట