Translate

Thursday, September 1, 2022

బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి & రుద్రగ్రంథి (Brahma Grandi, Vishnu Grandi and Rudra Grandi - telugu notes)

 



బ్రహ్మ గ్రంథి

గ్రంథి అంటే సత్యమైన చేతనత్వం, మూల ప్రకృతి యొక్క మాయాశక్తి ఏది ఏదో తెలియరానంత ముడి పడి ఉండటం. మన మనసులో కొన్ని మూడ్స్ ఉన్నాయి. వీటినే కళలు అంటారు. ఈ కళలు మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం దాక పని చేస్తూ ఉంటాయి. మూలాధారం స్వాధిష్ఠాన లపై ఆధిపత్యం వహించే బ్రహ్మ గ్రంథి 118 కళలతో శరీరంలో పనిచేస్తుంది. ఇవి సృష్టికి సంబంధించిన కళలు. ఖనిజాలు, వృక్షాలు, పశువులు, మానవుల దేశ కోశాలలో ఈ రెండు కేంద్రాల ద్వారా సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇది బ్రహ్మ సరస్వతుల అధిష్టాన స్థానం. ఇది మాయా బీజసహితం. చిత్కళ అనబడే ఆత్మకు అవిద్యా రూపమైన వాగ్భవమాయా స్థానం జీవ బ్రాంతి కలుగజేయడం వలన, అంటే తాను వేరు అనే భావన కలుగజేయడం వలన ఈ స్థూల దేహంలో నేను, నాది అనే అభిమానం జాగృతం అవుతుంది. అప్పుడు విశ్వుడు అనబడే జీవుడు "బ్రహ్మ గ్రంథి" అనిపించుకుంటాడు. దేహికి సత్యదర్శనం అయిన పరాకాష్ట స్థితిలో మాయాప్రకృతి కరిగి పోయి చిత్కళ ఉజ్వలంగా ఊర్థ్వ ముఖంగా అవుతుంది. ఇదే బ్రహ్మ గ్రంథి భేధనం. ఈ బ్రహ్మ గ్రంథి భేధనం ఆ ఆది పరాశక్తి అనుగ్రహం వలన మాత్రమే జీవులలో కలుగుతుంది. దేహ భ్రాంతి తొలగటమే బ్రహ్మ గ్రంథి భేధనం. ఈ బ్రహ్మ గ్రంథి మూలాధార, స్వాధిష్ఠాన లలో 118 కళలతో ఆయా చక్రస్వామ్యంతో భౌతిక సృష్టి, దేహ సృష్టి, దేహనిర్మాణ పోషణా క్రియలను పరిరక్షిస్తూ ఉంటుంది.

 

 

విష్ణు గ్రంథి

 

ఇది అనాహత మణిపూర చక్రముల నడుమ కామరాజ మాయా బీజస్థానంలో ఉంటుంది. ఇది లక్ష్మీనారాయణ స్థానం. ఇక్కడ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ లనే మూడు కోశాలలో తైజసుడు అనబడే జీవుడు స్వప్నావస్థను పొంది ఉంటాడు. ఇదే విష్ణు గ్రంథి. జీవుడు మూలాధార స్వాధిష్ఠాన చక్రాలపైన , మణిపూరకం క్రింద ఉన్న బ్రహ్మ గ్రంథిని భేధించి, చిత్కళా దర్శనం పొంది ఊర్థ్వ ముకుడై పయనించినప్పుడు తైజసుడు అవుతాడు. కానీ అతను ఇంకా స్వప్నావస్థలోనే ఉంటాడు. ఇది భావా భావాల, బింబప్రతిబింబాలతో సమానమైన జీవ బ్రహ్మల కలయిక స్థానం. ఈ ధేహం నాది కాదు అని, ఈ ధేహం నేను కాదని, ఆ పరాదేవి ఒకటే పరమ సత్యం అని స్ఫురణ కలగడం బ్రహ్మ గ్రంథి భేధనం అయినా ఇది ఇంకా కూడా బ్రాంతి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆ భ్రాంతే విష్ణు గ్రంథి అనబడుతుంది. సూక్ష్మ ధేహ సంబంధంతో అదే ఆత్మ గా భ్రాంతి చెందటం విష్ణు గ్రంథి.

 

అమ్మవారు పరా నాడి రూపంలో అనాహతంలో ఉంది. ఇక్కడ సూటిగా క్రింద నుండి శిరస్సుకి వెళ్ళే నాడి ఒకటి ఉంది. అనాహతం వాయుమండల బీజం. ఇది 106 కళలతో పని చేస్తుంది. ఈ స్థూల ధేహమూ, ప్రపంచం అంతా అసత్యం అని, సత్యం ఒక్క పరమాత్ముడే అని గ్రహిస్తాడు. అలాంటి జీవుడు తన భావనాదార్యము, గురువు యొక్క కటాక్షం, విచారణా బలంతో జీవత్వం స్వప్న సదృశం కనుక, స్థూల సూక్ష్మ ప్రపంచాలు రెండూ కల్పనలే కనుక, ఇవి ఏవి తన రూపం కాదు అని,తను పరమాత్మ స్వరూపం అని తెలుసుకుంటాడు. అప్పుడు అతని ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలను అధిగమించి తనలోని వేణు నాదాన్ని ఆలకించగలుగుతాడు. ఇదే విష్ణు గ్రంథి భేధనం.


రుద్రగ్రంథి

ఇది విశుద్ది ఆజ్ఞా చక్రాల స్వామ్యము కలిగి ఆజ్ఞా చక్రము నడుమ ఉంటుంది. ఇది 136 కళలతో పనిచేస్తుంది. విష్ణు గ్రంథి భేధనం జరిగిన సాధకుడి స్థాయి ఇంకా సత్యతత్త్వ స్వరూపం అందీ అందినట్లు,తెలిసీ తెలియనట్లు గా ఉంటుంది. అలాంటి స్థితిలో సాధనతో ఆ సత్యస్థితిని హృదయం లో స్థిరంగా నిలుపుకొని ఉండటం వలన ప్రాజ్ఞుడైన జీవుడు తాను సత్యానికి ప్రతిబింబముననే ప్రతిబింబానందం అంటే సోహం అనే అవగాహన వలన కలిగిన ఆనందం! అనుభవిస్తూ ఆనందకోశంలో ఉంటాడు. అయినా అతడు అప్పటికి పూర్తి జాగృతుడు కాదు. పూర్తి మెలకువ, పూర్తి సుషుప్తి కాని ఒక తన్మయావస్థలో ఉంటాడు. ఇంకా స్పష్టమైన సత్యస్థితి స్థిరంగా, దృఢంగా అందని వాడు అవడం వల్ల అతను సత్వగుణం కలిగినవాడైనా రజోగుణ ఛాయలు వీడని వాడై ఉంటాడు. అందుకే ఈ స్థితిలో సాధకుడు "కలుష సత్వగుణ ప్రధానుడు ' అనబడతాడు. ఈ స్థూల శరీరం లో సూక్ష్మ కారణ శరీరాలు,24 తత్త్వాలు, పంచ కోశాలు, గ్రంథి త్రయం మొదలైన అనేక సంజ్ఞలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా స్థూలం కావడం మూలంగా సామర్థ్యం లేనివై ఉంటాయి. పంచాశద్వర్ణాలలో మొదటిది "అ" ఆకరిది "హ" ఈ రెండూ కలిసినప్పుడు 'అహం" అదే ఆత్మ మంత్రం. ఈ రెండింటి సమ్మేళనములోనే శబ్ద బ్రహ్మమంతా ఇమిడి ఉంది. సహస్రారం లో బిందు రూపిణీ అయి సకల సృష్టి వ్యవహరహేతువైన ఆ పరాశక్తి సాక్షీభూతంగా ఉంది. ఆ శక్తి ప్రజ్ఞానం. అదే చిత్కళ. అదే అహంవాచ్య శబ్ద బ్రహ్మ. స్థూల శరీర అభిమానం బ్రహ్మ గ్రంథి భేధనం తో, సూక్ష్మ శరీరం అభిమానం విష్ణు గ్రంథి భేధనం తో నశించి పోతాయి. ఈ రెండు మిథ్యారూపములు అయినప్పుడు సత్యం ఏంటో దానిని సూచించేది రుద్ర గ్రంథి. ఇది విఛ్ఛేదనమైనప్పుడు చిత్కళతేజః పుంజం పూర్తిగా వికసించి సాధకుడు సుస్థిర జ్ఞానం పొంది శాంతుడు అవుతాడు. ఇది సాధన యొక్క పరాకాష్ఠ.

 


reference 

మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ 

మణిపూరాంత రుదితా,విష్ణుగ్రంథి విభేదినీ ||

ఆఙ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ 

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ||


బ్రహ్మగ్రంథి - 108, విష్ణుగ్రంథి - 116, రుద్రగ్రంథి - 136 మొత్తం కలిసి 360 కిరణాలు (డిగ్రీలు). ++++

 

99. మూలాధారైక నిలయా

మూలాధార చక్రం వద్ద కుండలినీ శక్తి ఒక సర్పము వలె మూడున్నర చుట్లు 

చుట్టుకుని, శిరసుని కప్పుకుని, నిద్రాణ స్థితిలో ఉంటుంది. శ్రీదేవి స్థానం ఆ మూలాధారచక్రమే. 

ఆ మూలమే మొదలు కనుక అది ఆధారం. ఆధారం అది ఒక్కటే కనుక అది ఏక ఆధారం. 

అక్కడ నివాసం వున్న ఆ శ్రీదేవి, మూలాధారైకనిలయ. 

మూలాధార చక్రపద్మానికి నాలుగు రేకలు. ఆ పద్మ మధ్య బిందువుకే కులకుండమని పేరు. 

ఆ కులకుండము లోనే కుండలినీ శక్తి  ముడుచుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది. 

అదే అమ్మ నిలయము. అక్కడ వున్న కుండలినీ శక్తి సుషుమ్న ద్వారా, సహస్రారం వద్ద వున్న 

శివుడ్ని చేరటానికి ఊర్ధ్వగమనం మొదలెడుతుంది. 

అమ్మే స్వయంగా ఉపాసకులను మూలాధారం నుంచి సహస్రారం వరకు నడిపించి, అక్కడ 

శివునితో కలుపుతుంది. నిరంతరమూ ఆ సాధనలో ఉండటమే దానికి త్రోవ.   

నిద్రాణమై వున్న కుండలినిని ఉపాసనతో లేపితే, ఆ శక్తే మనల్ని ముందుకు నడిపిస్తుంది. 

మూలాధారచక్రం వద్ద కుండలినీ రూపంలో వున్న  మూలాధారైకనిలయ కు వందనం. 

ఓం శ్రీ మూలాధారైకనిలయాయై నమః 

 

100. బ్రహ్మగ్రంథి విభేదినీ 

 

మన శరీరంలో ఆరు చక్రాలు, మూడు గ్రంధులువున్నాయి. గ్రంధి అంటే ముడి. 

సంసారలంపటంలో పడి, మనకు మనమే వేసుకున్న చిక్కుముడులుగా వీటిని భావించండి. 

మొదటి గ్రంధి బ్రహ్మగ్రంధి. ఆ గ్రంథిలో బ్రహ్మ ఉంటాడు కనుక అది బ్రహ్మ గ్రంధి. 

ఈ ముడి మూలాధారచక్రము, స్వాధిష్ఠానచక్రములకు వేసిన ముడి.

మూలాధారం పైన ఒకటి, స్వాధిష్టానము పైన ఒకటి, మొత్తము రెండు గ్రంధులున్నాయి. 

ఆ రెండు గ్రంధులనూ కలిపి బ్రహ్మ గ్రంధి అంటారు. స్వాధిష్టానపద్మమునకు ఆరు రేకలు. 

 

జీవుడు ఉపాసనతో, గురుసహాయముతో, బుద్ధితో ఈ ముడిని విప్పుకుని పైకి సాగాలి. 

ఈ గ్రంధి భేదనము జరగకపోతే, జీవుడు మరింతగా విషయలాలసలో పడిపోతాడు. 

ఆ గ్రంధి భేదన శక్తి అమ్మయే. ఆ బ్రహ్మ గ్రంధి భేదనం జరిగితే కానీ, విషయవాసనలు వీడవు. ఉపాసకులకు ముడి వేసేదీ అమ్మమాయే, తిరిగి ఆ ముడిని విప్పేదీ అమ్మమాయే.  

ఈ మాయా సంసార జంజాటము దాటించి, బ్రహ్మగ్రంధిని భేదించే జ్ఞానాన్నిచ్చే, 

 

 బ్రహ్మగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః 

 

101. మణిపూరాంతరుదితా

స్వాధిష్టాన చక్రానికి పైనున్నది నాభి దగ్గర వున్నమణిపూర చక్రం. ఈ పద్మానికి పది రేకలు. 

ప్రతి పద్మానికీ ఉన్న ప్రతిరేకా, సాధనా మార్గంలో జీవుడికి జ్ఞాన సముపార్జనలో 

రకరకాలైన అనుభవాలను ఇస్తుంది. బ్రహ్మ గ్రంధి భేదనము అయి, దాన్ని దాటగానే, 

అక్కడ వున్న మణిపూర చక్ర మధ్యములో అమ్మ ప్రకటితమవుతుంది.  

ఆ మణిపూర చక్ర పద్మ మధ్యంలో వున్న తల్లే మణిపూరాంతరుదిత.  

అక్కడ శ్రీదేవిని మణులతో పూజిస్తే ఆమె తృప్తి చెందుతుంది. 

ఒక పది దళాలతో వున్న పద్మాన్ని ఊహించుకోండి. ఆ పద్మం మధ్యలో, 

చక్కగా రత్నాభరణాలతో, మణిమకుటాలతో కూర్చుని వున్న శ్రీదేవిని దర్శించండి. 

ఆ అమ్మకు మీరు రత్న మాణిక్యాలతో పూజచేస్తున్నట్టు భావించండి. 

ఆ మణిపూరాంతరుదిత అప్పుడు సంతృప్తయై, 

మిమ్మల్ని సాధనా మార్గంలో ముందుకు తీసుకుని వెళ్తుంది. 

మణిపూర చక్రపద్మ మధ్యంలో ప్రకటితమైన  మణిపూరాంతరుదిత కు వందనం. 

ఓం శ్రీ మణిపూరాంతరుదితాయై నమః 

 

 

102. విష్ణుగ్రంథి విభేదినీ

మణిపూర చక్రం పైన విష్ణుగ్రంధి వున్నది. ఈ ముడి వద్ద విష్ణువు ఉంటాడు. 

ప్రతి జీవిలోనూ సురాసురులిద్దరూ వుంటారు. 

ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే, అయినా ఎప్పుడూ పరస్పరం కలహించుకుంటూనే వుంటారు. 

ఈ విరోధం హద్దులు దాటినప్పుడు, స్వయంగా విష్ణువే ప్రకటితమయి,ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు. ఏదీ ఎక్కువగా చేయకుండా, రాగము - ద్వేషము కానీ, మిత్రత్వము - శత్రుత్వము కానీ, ఆశ - దురాశ కానీ శృతి మించకుండా చూసే శక్తి విష్ణుశక్తి. 

మణిపూర చక్రమునకు పైన వున్న గ్రంధి విష్ణు గ్రంధి.  ఆ ముడి వద్ద విష్ణువు వున్నాడు కనుక అది విష్ణు గ్రంధి. ఈ గ్రంధి వద్ద సాధకుడు తానే ఆ విష్ణువు అన్న భావనలో ఉండాలి. 

అన్నిటి పట్లా సమతాభావం ఉండాలి. దాన్నే సోహం అని మనం చెప్పుకుంటున్నాం. 

ఆ పైన వున్న చక్రం అనాహతం. ఆ పద్మానికి పన్నెండు రేకలు. 

ఇది హృదయ స్థానమందు వున్నది. హృదయమంతా విష్ణువే కొలువై ఉన్నట్టు భావించాలి. 

ఆ విష్ణువే నేను అన్న భావంలో స్థిరపడితే, ఈ రెండు చక్రాలకూ వున్న ముడి, 

ఆ విష్ణు గ్రంధి భేదనం జరుగుతుంది. ఆ తరువాత విష్ణుమాయ విడిపోయి, సాధన పైకి సాగుతుంది. విష్ణుగ్రంధి విభేదనం చేసి, విష్ణుమాయను తొలగించిన,  విష్ణుగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ విష్ణుగ్రంథివిభేదిన్యై నమః 

 



103. ఆజ్ఞా చక్రాంతరాళస్థా

కనుబొమల మధ్య గల భాగాన్ని భృకుటి అంటాం. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. 

ఆ ఆజ్ఞాచక్రపద్మ మధ్యంలో పరమేశ్వరి, ప్రసన్నంగా ఆశీనురాలయి ఉంటుంది. 

ఈ పద్మానికి రెండే రేకలు. అవి ఇడా, పింగళా నాడులకు సంకేతం. 

ఆ రెండింటి మధ్య నుంచి సుషుమ్నానాడి, పైకి సహస్రారం వైపుకు కదులుతుంది. 

ఈ రెండు రేకలూ శివ, శక్తి స్థానాలకు కూడా సంకేతం.  

ఈ ఆజ్ఞాచక్రం వద్ద జపం చేస్తే, ఆజ్ఞాపించ గల గురువు దర్శనం అవుతుంది.

ఋషుల దర్శనం అయ్యేదీ ఇక్కడే. అక్కడే జ్ఞానం సిద్ధిస్తుంది. 

ఇక్కడి నుంచీ అయ్యే దర్శనాలేవీ భ్రమలు, భ్రాంతులు కావు.  

అప్పటికి జీవుడు, మనోనిగ్రహం పొంది, కోరికలు దగ్ధమయి, బాహ్య ప్రేరణల పట్ల 

ఎక్కువగా చలించని స్వభావాన్ని కలిగి ఉంటాడు.  

ఆ ఆజ్ఞా చక్రంలో ఉంటూ మనలను ఉద్ధరిస్తున్న, ఆ ఆజ్ఞాచక్రాంతరాళస్థ కు వందనం. 

ఓం శ్రీ ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః

 

104. రుద్రగ్రంథి విభేదినీ 

 

మూలాధార, స్వాధిష్టాన చక్రముల వద్ద గల బ్రహ్మ గ్రంధి, పంచభూతములలోని 

 

పృధ్వీ తత్వము, జల తత్వములకు సంబంధించినది.  రెండవ గ్రంధి అయిన విష్ణు గ్రంధి, మణిపూర చక్రము పై భాగములో వున్నది. ఈ గ్రంధికి పైనా, కిందా వహ్ని, సూర్య చక్రములు ఉన్నాయి. ఇవి తేజోమయ చక్రాలు. ఇవి పంచభూతముల లోని అగ్నితేజ తత్వాలు.  అనాహత చక్రము హృదయస్థానములో వుంది. అనాహత పద్మమునకు పన్నెండు రేకలు. 

 

 హృదయములో వాయువు, దహరాకాశము వున్నది. ఇక మూడవ గ్రంధి, అనాహత చక్రము దాటి వున్న రుద్రగ్రంధి. విశుద్ధి చక్రము కంఠమందు ఉంటుంది. ఈ చక్ర పద్మానికి పదహారు రేకలు. కంఠమందు ఉండేది ఆకాశము. ఆపైన భృకుటి వద్ద ఉండేది ఆజ్ఞాచక్రము. 

 

పంచభూతములలో వాయురాకాశాల స్థానములు  ఇవి. ఈ శరీరం పాంచభౌతికమైనది. అని అంటూ ఉంటాం కదా, ఆ పంచభూతాలూ ఈ విధంగా మన శరీరంలో వున్నాయి. 

ఈ హృదయ పద్మము దాటి జపం జరిగినపుడు, రుద్రగ్రంధి ఉత్తేజితమయి, చిదానందాన్ని కలిగిస్తుంది. జీవుడిలో వున్న వాయుతత్వం, రుద్రగ్రంధి భేదన ద్వారా బయటకు వెళ్లి  బహిరాకాశంలో కలిసిపోతుంది. అప్పుడు లోపలా, బైటా ఒకటే ఆకాశతత్వం. అక్కడకు చేరిన జీవుడికి, మూడవ కన్ను తెరుచుకుంటుంది.  

 

ఇక్కడ మనసు నిలిపి, జపం చేస్తే, అమ్మ కరుణించి, రుద్రగ్రంధి భేదనము చేస్తుంది. 

ఆ విధంగా రుద్రగ్రంధి విభేదనం చేయించే, ఆ రుద్రగ్రంథివిభేదిని కి వందనం. 

ఓం శ్రీ రుద్రగ్రంథివిభేదిన్యై నమః 

 

105. సహస్రారాంబుజా రూఢా

ఆజ్ఞ పైన సహస్రార కమలమని చెప్పుకున్నాం కదా. ఈ పద్మానికి వెయ్యి రేకలు.  

ఇదిగో, ఇక్కడ, ఆ లలితా పరమేశ్వరి సహస్రార కమలంపై కూర్చుని ఉన్నది. 

తల మధ్యలో వున్న మాడు వద్ద వున్న ప్రాంతం ఈ సహస్రార స్థానం. 

మాడు పుట్టినప్పుడు తెరచుకుని ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మాయ కమ్మి మూసుకుపోతుంది. 

దీనికి పైన  బ్రహ్మ రంధ్రమున్నది. జపతపాలతో ఆ బ్రహ్మ రంధ్రాన్ని తెరచుకుని జీవుడు 

స్వేచ్చని పొందాలి. అప్పుడే జీవుడికి తానే దేవుడు అన్న భావన స్థిరపడుతుంది. 

ఆ స్థితిని పొందితే జీవుడు ఆ సహస్రార పద్మంలో, వెలిగిపోతున్న లలితా పరమేశ్వరిని దర్శించి, 

బ్రహ్మానంద భరితుడవుతాడు. ఒక్క విషయం శ్రద్ధాభక్తులతో గమనించండి.  

ఈ మొత్తం సాధనా క్రమంలో, ప్రతి దశలోనూ అమ్మ జీవుడితోనే వున్నది. 

తల్లి పిల్లలను ఎంత భద్రంగా, పక్కనే వుండి నడిపిస్తుందో,  లలితమ్మ కూడా 

తన రక్షణ కోరి వచ్చిన అందరినీ, కాపు కాచుకుంటూ తన మార్గంలో నడిపిస్తున్నది. 

సహస్రార కమలంలో ఉంటూ మనలను ఎంతో అవ్యాజానురాగంతో, ప్రేమతో, 

కరుణిస్తున్న, ఆ సహస్రారాంబుజారూఢ కు వందనం. 

ఓం శ్రీ సహస్రారాంబుజారూఢాయై నమః 

 

106. సుధాసారాభి వర్షిణీ

ఆ సహస్రార కమల స్థాయికి చేరుకుంటే, సుషుమ్నానాడి ద్వారా పైకి వెళ్లిన 

జీవుడికి దొరికేది అమృతవర్షము. అమ్మ అక్కడ చంద్రవంక రూపములో సుధలను వర్షిస్తుంది. 

ఆ సుధాధారలను స్రవిస్తున్న తత్వమే కామధేను తత్వము. 

గ్రంధి భేదనములు జరిగి, ఇంద్రియ నిగ్రహంతో, అసూయ లేని అనసూయ తత్వంతో, 

సమస్త సృష్టి పట్లా ఏకత్వ భావము పొందిన, జీవుడికి ఇక్కడ కామధేనుతత్వం బోధపడుతుంది. 

ఈ జ్ఞానం పొందిన వారికి, గరికపోచ బ్రహ్మాస్త్రమెలా అవుతుందో, 

అదే విధంగా సామాన్య ధేనువు, కామధేనువు అవుతుందని అవగాహన కలుగుతుంది. 

అటువంటి కామధేనువు జ్ఞాన సుధాధారలను తన పొదుగు నుంచి వర్షిస్తుంటే, 

డెబ్బై రెండు వేల నాడులూ ఆ అమృత ధారలలో తడిసి జీవుడు ఆనందభరితుడవుతాడు.  

సరియైన మార్గంలో సాధన చేస్తే, ప్రతి గ్రంధీ ఉపాసకుల పాలిట కామధేనువు అవుతుంది. 

ఆ స్థితికి చేరుకోవాలంటే అమ్మ చరణాలను పూజించాలి. అప్పుడు ఆ చరణకమలాలే 

ఉపాసకులను సహస్రార కమలానికి చేరుస్తాయి. జీవుని శరీరమంతా పద్మమయం. 

ప్రతి పద్మమూ, దాని ప్రతి దళమూ ఉపాసకులకు దివ్యానుభూతులను అందిస్తాయి.

ఆ అమృత అనుభూతులను, సహస్రారకమలం చేరుకున్న ఉపాసకుల కొరకు, 

చంద్రమండలం నుంచి, సుధాధారల రూపంలో వర్షిస్తున్న, ఆ సుధాసారాభి వర్షిణి కి వందనం. 

ఓం శ్రీ సుధాసారాభివర్షిణ్యై నమః 

 

No comments:

Post a Comment