Translate

Thursday, August 5, 2021

అంతః కరణ శుద్ధి- Anthahkarana Suddi

 🧘‍♂️అంతః కరణ శుద్ధి🧘‍♀️















అంతః కరణ శుద్ధి ఎట్లా వస్తుంది?..


భగవంతుని కోసం నిరంతరం పరితపించటాన్నే "తపస్సు" అంటారు.

మనోవాక్కాయకర్మల యందు అధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్థిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు.

అట్లా తపస్సు చేయటం చేత మల విక్షేప ఆవరణాలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం తొలగుతుంది. మననం చేత విక్షేప దోషం తొలగుతుంది. నిరంతర ధ్యానమనే నిది ధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శరీరాన్ని శుద్ధి చేసుకొన్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వాసనాక్షయం జరుగుతుంది.

పూర్వ జన్మ వాసనలు క్రమేపీ తొలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్నీ, ఇంద్రియలోలత్వాన్ని బుద్ధిపూర్వకంగా నిగ్రహించుకోవటంవల్ల మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది.

కావున శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి. తపస్సు చేయాలంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాలు చేరాలి అని కాదు. ప్రతి మానవుడు తాను జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. తన ఇల్లే తనకు, తపస్సుకు కూడా అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. తాను మారాలి. ఎందుకు ? మోక్షాకాంక్ష ఉండబట్టి.

మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు, ఉద్దేశించాడు) ఏర్పరిచాడు. మానవుడు దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్ధిగా తపస్సంపన్నుడు కావాలి. దేనికి? ఆనందం కోసం - మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.

ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం ఆత్మలోనే ఉంది. ఆత్మానందమే నిజమైన సచ్చిదానందం. దానికి ఆత్మజ్ఞానం కలిగితే మానవుడు సక్రమ మార్గంలో జీవించటానికి వీలు కలుగుతుంది.

నిషిద్ధమైన కర్మల్ని ఆచరించకుండా ఉంటే మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు, మానసికమైన వికారాలు కూడా లేకుండా చూసుకోవాలి. మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల  ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.

ఈ ఆధునిక కాలంలో మానవులందరిలోను జరుగుతున్న నిత్య కృత్యం ఈ మానసికమైన సరికాని ఆలోచనా విధానం. దాన్ని అన్ని విధాల అరికట్టాలి. దాన్ని అరికట్టటానికి మనస్సుకి తోడుగా ఆత్మ అనే భగవంతుని దానికి అందించి, ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేటట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం, వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్ధిస్తుంది. బంగారానికి తావి అబ్బినట్లు అవుతుంది.

అయితే పాపాలు నశించి, ప్రశాంతత చేకూరి, సాధకుడు మోక్షం కోసం జీవించాలంటే అనురాగం కూడా నశించినవాడై ఉండాలన్నారు. విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత రాగం నశించదు. విషయంతోపాటు దానియందలి అనురాగం కూడా దూరం కావాలి అంటే మనస్సుకి ఆత్మ అనే భగవంతునితో అనుసంధానం చేకూరిస్తేనే రాగం కూడా నశిస్తుంది. సాధకుడు అభిమానం, అహంకారం వంటి వాటికి తనలో స్థానం ఏర్పరుచుకొంటే ప్రత్యేకమైన కోరికలకు అది నిలయం అవుతుంది.

కావున సాధకుడు అభిమానం, అహంకారం అనే వాటికి స్థానం లేకుండా చేసుకొంటూ వెళ్ళాలి. అప్పుడు కోరికలకు స్థానం లేకుండా పోతుంది. మనస్సుకి నిస్సంకల్ప స్థితి చేకూరుతుంది. అదే మోక్షాన్ని కాంక్షించటానికి తగిన స్థితి.

మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని ఆత్మ నుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయటం అన్నమాట. మనస్సుని ఆత్మలో లయమయ్యేటట్లు చెయ్యటం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేదని చాలా మంది భ్రమపడుతుంటారు. అది తప్పు.

బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమేకాని మరొకటి కాదు. సాధనలో మెలకువలో నిద్రను, నిద్రలో మెలకువను అనుభవించాలి. అదే మోక్షం.

ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్ళవాళ్ళకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. దాన్ని ఎంత అని ప్రతినిత్యం కొలవటం కాదు చేయవలసింది.

ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై ఆత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాసక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు.

ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానం కోసం ఆనందం పొందాలనేకునే వారందరూ ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.

No comments:

Post a Comment