జీవితంలో మనం ఏమవ్వాలనేది మన విలువలు, మన కలలు, మన ఆలోచనలు నిర్ణయించాలి. పరిస్థితులు
మనల్ని ప్రభావితం చేయవచ్చు. మన ప్రయాణాన్ని మార్చవచ్చు. కానీ మనం ఎవరిగా మారాలనేది,
ఎలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలనేది చివరికి మన ఎంపికే
కావాలి. పరిస్థితుల వల్ల బలవంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాకూడదు.
ఒక గేయ రచయిత ఇలా అన్నారు:
"నొప్పి లేని నిమిషమేది? జననమైనా, మరణమైనా జీవితాన అడుగు అడుగున...
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ."
ఈ పంక్తులు విన్నప్పుడల్లా నా మనసులో ఒక సందేహం మెదిలేది.
"బ్రతుకు అంటే నిత్య ఘర్షణే అయితే,
నేను ఎలా ఉండాలో కూడా పరిస్థితులే నిర్ణయిస్తాయా? అలా అయితే నా ఎంపిక, నా స్వేచ్ఛ ఎక్కడుంది?"
కాలక్రమేణా నాకు ఒక విషయం అర్థమైంది. ఈ పంక్తుల ఉద్దేశ్యం
మనిషి ఎప్పుడూ ఘర్షణలోనే జీవించాలని చెప్పడం కాదు. జీవితం అంటే సవాళ్లు, మార్పులు, నొప్పి, ఆనందం—ఇవన్నీ
కలిసిన ఒక నిరంతర ప్రయాణమని గుర్తు చేయడమే.
నిజానికి, భారతీయ తత్వశాస్త్రం ఈ విషయాన్ని మరింత
లోతుగా వివరిస్తుంది.
భగవద్గీత చెబుతుంది: "యోగస్థః కురు కర్మాణి" — అంతరంగ ప్రశాంతతలో నిలిచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
బుద్ధుడు బాధ జీవితం లో భాగమే అని చెప్పాడు. కానీ బాధ నుంచి
పారిపోవడం కాదు; బాధతో ఎలా జీవించాలో నేర్చుకోవడమే విముక్తి
అని బోధించాడు.
శివ తత్వం కూడా ఇదే సందేశాన్ని ఇస్తుంది.
శివుడు తాండవానికి ప్రతీక, అలాగే ధ్యానానికి కూడా ప్రతీక. అంటే మార్పు,
ఘర్షణ, ప్రశాంతత—ఈ మూడూ జీవితంలో సహజమైన
భాగాలే.
అప్పుడు నాకు అర్థమైంది—పరిస్థితులు మన జీవితాన్ని
పరీక్షించవచ్చు, కానీ మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేవు.
ఘర్షణ బయట ప్రపంచంతో ఉండవచ్చు. కానీ ప్రశాంతత మన అంతరంగంలో
ఉండవచ్చు. ఈ రెండూ ఒకేసారి సాధ్యమే.
ఒక పడవ సముద్రంలో ప్రయాణిస్తుంది. సముద్రంలోని అలలు ఎప్పుడూ
ఆగవు. కానీ పడవను నడిపే నావికుడు తన సమతుల్యతను కోల్పోకపోతే, అతను తన గమ్యాన్ని చేరుకోగలడు. అలాగే జీవితంలోని సమస్యలు పూర్తిగా
మాయమవ్వకపోవచ్చు. కానీ వాటి మధ్య కూడా మన అంతరంగ ప్రశాంతతను కాపాడుకోవడం
నేర్చుకోవచ్చు.
అందుకే ఇప్పుడు నేను ఇలా నమ్ముతున్నాను:
పరిస్థితులు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చవచ్చు. కానీ
నేను ఎవరిగా ఉండాలో నిర్ణయించే హక్కు నాదే. అదే మనిషికి ప్రకృతి ఇచ్చిన గొప్ప
స్వేచ్ఛ.
నిజమైన విజయం ప్రపంచంతో పోరాడటంలో కాదు; పోరాటాల మధ్య కూడా మన ప్రశాంతతను, మన విలువలను
కోల్పోకుండా జీవించడంలో ఉంది.
— సురేష్ కుమార్ కలిమహంతి